వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ గెలవాలని ఎన్నో జట్లు గంపెడాశలు పెట్టుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్న ఆస్ట్రేలియాతోపాటు హాట్ ఫేవరెట్లుగా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా ఈ ప్రపంచకప్ బరిలో దిగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచకప్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది.
ఈ టోర్నీ విజేతలు ఏకంగా 1.6 మిలియన్ డాలర్లు తమ ఖాతాలో వేసుకుంటారు. అంటే మన లెక్కల్లో చెప్తే రూ.13 కోట్లపైనే అన్నమాట. ఈ టోర్నీ ప్రైజ్ పాట్ 5.6 మిలియన్ డాలర్లు. వీటిలో విజేతకు 1.6 మిలియన్ డాలర్లు దక్కుతాయి. రన్నరప్గా నిలిచిన జట్టు 8 లక్షల డాలర్లు, సెమీఫైనల్ చేరిన జట్లు చెరో 4 లక్షల డాలర్లు అందుకుంటాయి.
గతేడాదిలానే ఈ ఏడాదిలో కూడా సూపర్-12 దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లు 70 వేల డాలర్లు పొందుతాయి. ఈ దశలో జరిగే 30 మ్యాచుల్లో ఒక్కో గెలుపు విలువ 40 వేల డాలర్లని ఐసీసీ తెలిపింది. అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిల్యాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఈ టోర్నీని సూపర్-12 స్టేజ్ నుంచే ప్రారంభిస్తాయి. మొదటి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించే నాలుగు జట్లకు ఒక్కో జట్టుకు 40 వేల డాలర్లు అందజేస్తారు.