న్యూఢిల్లీ: పాన్పరాగ్, గుట్కా నమిలేవారు ఎక్కడపడితే అక్కడ ఊస్తుంటారు. అయితే ఈ అలవాటు ఉన్న ఒక వ్యక్తి విమానాన్ని కూడా విడిచి పెట్టలేదు. విమానం కిటికీ వద్ద కూర్చొని ప్రయాణించిన ఆ వ్యక్తి విండో వద్ద గుట్కాను ఊశాడు. దీంతో అక్కడ మరక పడింది. ఆ విమానంలో ప్రయాణించిన ఒక ఐఏఎస్ అధికారి దీనిని చూసి తన మొబైల్ ఫోన్లో ఫొటో తీశారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో విమానంలో గుట్కాను ఊసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు.
ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇటీవల విమానంలో ప్రయాణించారు. విమానం కిటికీ వద్ద గుట్కా మరక ఉండటాన్ని ఆయన గమనించారు. దీంతో తన మొబైల్ ఫోన్తో దాని ఫొటో తీశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోను బుధవారం పోస్ట్ చేశారు. ‘ఎవరో తన గుర్తింపును ఇలా వదిలివెళ్లారు’ అని హిందీలో పేర్కొన్నారు. విమానంలో గుట్కా ఉమ్మిన వ్యక్తిపై ఈ మేరకు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమానంలో గుట్కా ఉమ్మిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పటి వరకు బస్సులు, రైళ్లను అశుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు విమానాల్లో కూడానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి చొక్కా విప్పించి దానిని తుడిపించాలని కొందరు డిమాండ్ చేశారు. అతడిని గుర్తించి భారీగా జరిమానా విధించాలని కొందరు సూచించారు. విమానం సీటుకు చూయింగ్ గమ్ను అంటించిన ఫొటోను మరొకరు షేర్ చేశారు.
अपनी पहचान छोड़ दी किसी ने. pic.twitter.com/xsl68VfhH1
— Awanish Sharan (@AwanishSharan) May 25, 2022