ఎటాక్ (Attack) సినిమా విడుదల కోసం రెడీ అవుతున్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ యాక్టర్ జాన్ అబ్రహాం (John Abraham). లక్ష్య ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ఇండియా తొలిసూపర్ సోల్జర్గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez), టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలతో సహనం కోల్పోయాడు జాన్ అబ్రహాం.
కొన్ని ప్రశ్నలకు తనదైన స్టైల్లో జవాబిచ్చాడు. బాలీవుడ్ కంటే ఎక్కువగా దక్షిణాది సినిమాలు, డైరెక్టర్లు ప్రశంసించబడతారన్న ప్రశ్నకు జాన్ అబ్రహాం స్పందిస్తూ..రాజమౌళి అంటే చాలా గౌరవముంది. కానీ మేం చేసే దాన్ని కూడా చాలా గౌరవిస్తాం. మేం ఖచ్చితంగా నంబర్ 2 కాదు..ఎవరితో పోల్చినా అంటూ సమాధానమిచ్చాడు. ప్రభాస్ నటిస్తోన్న సలార్ లో కీలక పాత్ర చేస్తున్నారా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ..నేను ప్రాంతీయ భాష (regional film)లో సినిమా అస్సలు చేయను. నేను హిందీ హీరోను. సెకండ్ లీడ్ ఉండే సినిమా అస్సలు చేయను. ఇతర యాక్టర్లలాగా తెలుగు సినిమా (Telugu film) కానీ, ఇతర భాషా చిత్రాలు కానీ చేయబోనని తెగేసి చెప్పాడు జాన్ అబ్రహాం.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడమని ఓ రిపోర్టర్ అడుగగా..తాను ఆ సినిమా చూడలేదని, దాని గురించి మాట్లాడేంత ఓపిక లేదంటూ మీడియాపై జాన్ అబ్రహాం ఆగ్రహం వ్యక్తం చేశాడు.