భువనేశ్వర్: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గత నెలలో తమిళనాడులోని ఊటీ కొండల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. అయితే హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది.
గజపతి జిల్లా పరలఖేమండిలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) హెలికాప్టర్ ఒకటి అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం సాయంత్రం పరలఖేమండిలో ఉన్న స్టేడియంలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో ఎగురుతుండటాన్ని వారు గమనించారు. అది మెల్లగా తాము ఆడుకుంటున్న గ్రౌండ్లోనే కిందికి దిగుతున్నదనది గుర్తించారు. దీంతో భయపడిన చిన్నారులు ఎక్కడివారు అక్కడ పారిపోయారు. అయితే హెలికాప్టర్ అత్యవసరంగా ఎందుకు దిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయంపై వాయుసేన అధికారులు విచారణ ప్రారంభించారు.
డిసెంబర్ నెలలో తమిళనాడులోని కోయంబత్తూర్, కూనురు మధ్యలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో రావత్ దంపతులు సహా 14 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8న వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు సీడీఎస్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూలూరు ఎయిర్బేస్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తుండగా అది ప్రమాదవశాత్తు కుప్పకూలింది.