ఇటీవలి కాలంలో క్రికెట్లో బాగా ట్రెండ్ అయిన విషయం దీప్తిశర్మ చేసిన రనౌట్. దీనిపై ప్రపంచ క్రికెట్ ప్రముఖుల మధ్య కూడా హాట్ హాట్గా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. రాజస్థాన్ తరఫున ఫినిషర్గా ఆడుతున్న రియాన్ పరాగ్.. తాజాగా ఒక ట్వీట్ చేశాడు.
దానిలో తను కూడా వచ్చే ఏడాది ఐపీఎల్లో ఎవరో ఒకరిని మన్కడ్/రనౌట్ చేస్తానని, అప్పుడు మంచి ట్విట్టర్ డిబేట్ మొదలవుతుందని చెప్పాడు. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ సమయంలో కూడా ఈ విషయం చర్చకు దారితీసింది. తను బౌలింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ త్వరగా క్రీజు దాటేస్తున్నాడని మిచెల్ స్టార్క్ హెచ్చరించాడు.
ఈ సమయంలో తాను దీప్తిశర్మను కానని, కానీ క్రీజు దాటడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఈ మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. తనకు ఈ తరహా రనౌట్ చేయడం ఇష్టం ఉండదని, అభిమానులు కూడా ఇది చూడటానికి ఇష్టపడరని చెప్పాడు. కాగా, ఐపీఎల్లో ఇప్పటి వరకు బట్లర్ రెండుసార్లు ఇలా నాన్స్ట్రైకర్ ఎండ్లో రనౌట్ అయ్యాడు.