ఈ మధ్యే నిర్వహించిన ‘పూలమ్మ’ సిరీస్ ఎగ్జిబిషన్ విజయవంతమైంది. అయితే, ఇది ప్రివ్యూ షో మాత్రమే. ప్రధాన ప్రదర్శన ముంబైలో ఉంటుంది. నేను పూల పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తుంటాను. వాటిలో అయితే సాంఘిక, జానపద అంశాలను తీసుకోవచ్చు. నాన్నతో కలిసి చేసిన మొదటి పెద్ద ప్రదర్శన ఇది. ‘బతుకమ్మ’ సీజన్లో ‘పూలమ్మ’ ఎగ్జిబిషన్ పెట్టడం సంతోషంగా అనిపించింది. నాకు బతుకమ్మ అంటే ఇష్టం. నాన్న పెయింటింగ్స్లోనే బతుకమ్మ చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అమాయక పల్లెల్ని, మట్టి మనుషుల్ని అతిదగ్గరగా చూశాడు.
నాన్న.. మట్టి మనుషుల సజీవ చిత్రాల సంతకం. తెలంగాణ పల్లె సంస్కృతికి సాదృశ్య నిర్వచనం. ప్రకృతిని అలంకరించే పరిపక్వ చిత్రకారుడు. ఆ కళను.. కుంచెను.. ఇంద్రధనుస్సు లాంటి రంగులనూ.. చిన్నప్పుడే చేతబట్టింది. మహానగరంలో పుట్టిపెరిగినా ‘కదిరేణిగూడెం ఆడబిడ్డ’గానే చెప్పుకొంటుంది. తెలంగాణపై ప్రేమ, జానపదంపై ధ్యాస ఆమె ఆస్తిపాస్తులు. తాజాగా ‘పూలమ్మ’ ఎగ్జిబిషన్తో ప్రకృతిని, బతుకమ్మను పరవశింపజేసిన ప్రియాంక ఏలె కళా ప్రస్థానం ఆమె మాటల్లోనే..
హైదరాబాద్లో పెరిగినా, నెలకో రెండు నెలలకో తప్పక మా ఊరెళ్తాం. పండగలైతే అక్కడే చేసుకుంటాం. నానమ్మ ఉన్నన్ని రోజులూ వరంగల్ జిల్లాలోని కదిరేణిగూడెం వెళ్లేవాళ్లం. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ల ఊరు ఆత్మకూరు సింగారం వెళ్తున్నాం. చిన్నవయసులోనే నా మీద బతుకమ్మ ప్రభావం పడింది. మూలాల గురించి అమ్మానాన్న మాకు చెప్పేవాళ్లు. తెలంగాణలో దసరానే పెద్ద పండుగ. దసరా ముందు వచ్చే బతుకమ్మ ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. వేరే ఏ పండుగకూ లేనంత ఎగ్జయిట్మెంట్ బతుకమ్మకు ఉంటుంది. ఊరికి వెళ్లడమంటే ఏదో పిక్నిక్కు పోవడం కాదు. అక్కడి మనుషులతో, ప్రకృతితో మమేకం కావడం. వాళ్ల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం. బతుకమ్మకు చేసే మలీద ముద్దలు, పెరుగన్నం, పులిహోర నాకు చాలా ఇష్టం. వేరే సందర్భాల్లో తిన్నప్పటికీ బతుకమ్మ నాడు వచ్చే రుచి రాదు.
మా చిన్నతనంలో నాన్న ఇంట్లో కూర్చునే పెయింటింగ్స్ వేసేవాడు. ఎటుచూసినా కలర్స్, బ్రష్లే కనిపించేవి. అవే మాకు ఆటవస్తువులు అయ్యాయి. దీంతో కళల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. నాకు తెలిసి మూడు నాలుగు తరగతుల నుంచే పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాను. నాన్నే నా ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఇద్దరం ఒకే స్టూడియోలో పెయింటింగ్స్ వేస్తాం. పక్క పక్క సీట్లే. కానీ ఒకరి ప్రభావం ఇంకొకరిపై పడదు. బావుంది, బాలేదు అనుకునేంత వరకే. మా ఇద్దరి మధ్యా అలాంటి వాతావరణం ఉంటుంది. మా ఆయన అజయ్ ప్రసాద్, అత్తామామల సపోర్ట్ కూడా చాలా ఉంది. పని బిజీలో ఉన్నప్పుడు మా బాబు ఆరవ్ను అమ్మగానీ, అత్తమ్మగానీ చూసుకుంటారు.
పెయింటింగ్తో పాటు థియేటర్ ఆర్ట్పై పీహెచ్డీ చేశాను. ఈ మధ్యే థీసిస్ సబ్మిట్ చేశాను. ఏడేండ్ల పాటు సాగిన నా పరిశోధనలో కేస్ స్టడీగా బాలనాగమ్మ కథ తీసుకున్నాను. ఓ మహిళగా మరో మహిళ జీవితానికైతే న్యాయం చేయగలనని అని పించింది. సురభి, యక్షగానం కళాకారుల్లో ఇప్పుడున్నది చివరి తరం. తెలంగాణ బిడ్డగా ఇక్కడి సంస్కృతిని రికార్డ్ చేయడం నా బాధ్యత. కళ చాలా గొప్పది. మీడియా పెరగడం వల్ల కళల్ని చేరుకోవడం సులభంగా మారింది కూడా. కానీ ఎందుకో జనాలకే ఆసక్తి తగ్గిపోయింది. పిల్లలకు చూపిద్దామన్నా థియేటర్ గ్రూప్స్ లేవు. బాల్యం నుంచే వారికి కళలు, సంస్కృతి పరిచయమైతే జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి.
దాయి శ్రీశైలం