ముంబై: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి చేసిందెవరో తెలియదని కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీదీపై దాడి చేసిందెవరో తెలియదని, దాని వెనుక ఉన్న ప్రణాళిక కూడా తనకు తెలియదన్నారు. మమతపై దాడి జరిగిన ఘటన పట్ల విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలో రాజకీయం ఉన్నట్లు తనకు అనిపించడంలేదన్నారు. గతంలో ఎన్నడూ ఆమెపై దాడి జరగలేదని, ఇప్పుడెందకు ఆమెపై దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. బెంగాల్లో ఉన్న పరిస్థితిని పరిశీలిస్తుంటే.. బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి రామ్దాస్ అభిప్రాయపడ్డారు. గత పదేళ్ల నుంచి మమతా అధికారంలో ఉన్నదని, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కనీసం 20 సీట్లలో పోటీ చేస్తుందని, బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.