కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్లోని కొట్కాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన తమ్ముడు (రాహుల్ గాంధీ) కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇక.. రాహుల్ గాంధీ కూడా తన కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని స్పష్టం చేశారు.
‘నా సోదరుడు (రాహుల్) కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి రాహుల్ సిద్ధంగానే ఉన్నారు. తమ మధ్య భేదాభిప్రాయాలు లేవు. ఈ భేదాభిప్రాయాలు బీజేపీలోనే ఉన్నాయి. ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్షాకి, సీఎం యోగికి మధ్య భేదాభిప్రాయాలున్నాయో’ అని ప్రియాంక ఆరోపించారు. పంజాబీల మనస్తత్వాలను తాను అర్థం చేసుకోగలనని, తాను పంజాబీనే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. తన పిల్లల్లో పంజాబీ రక్తమే ఉందని, పంజాబీలు చాలా ధైర్యవంతులని ప్రియాంక కితాబునిచ్చారు.
ఆప్పై విరుచుకుపడ్డ ప్రియాంక
ప్రియాంక గాంధీ ఆమ్ఆద్మీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ఆద్మీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి పుట్టిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల నేపథ్యాలు, రాజకీయ పార్టీల గురించి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ప్రియాంక అన్నారు.