హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ రీజియన్ (హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి)లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే గతేడాది 96 శాతం ఎగబాకాయి. 2021లో 44,278 రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రముఖ దేశీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ల విలువ రూ.25,330 కోట్లుగా ఉన్నది. జూలైలో అత్యధికంగా 5,354 రిజిస్ట్రేషన్లు అవగా, వీటి విలువ 3,300 కోట్లు. డిసెంబర్లో 3,939 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే 2020 డిసెంబర్లో 3,957 రిజిస్ట్రేషన్లు అవగా, 0.5 శాతం తగ్గినైట్టెంది. గత నెల హైదరాబాద్లో 1,180, రంగారెడ్డిలో 2,693, సంగారెడ్డిలో 66 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2020 డిసెంబర్తో చూస్తే హైదరాబాద్లో 11 శాతం వృద్ధి కనిపించగా, రంగారెడ్డిలో 7 శాతం క్షీణత చోటుచేసుకున్నది. వీటన్నిటి వి లువ రూ.2,340 కోట్లు. గతంతో చూస్తే 16 శాతం ఎక్కువ.
1,000-2,000 చ.అ. ఫ్లాట్లకే గిరాకీ
అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొనేవారు ఎక్కువగా 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నవాటినే ఇష్టపడుతున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గత నెల అమ్మకాల్లో ఈ శ్రేణి ఫ్లాట్ల వాటానే 66 శాతంగా ఉందని స్పష్టం చేసింది. 15 శాతంతో 500-1,000 చదరపు అడుగుల ఫ్లాట్లు తర్వాతి స్థానంలో నిలిచాయి. 2,000-3,000 చదరపు అడుగుల ఫ్లాట్ల విక్రయాలు 11 శాతంగా ఉంటే, 0-500, 3,000లకుపైగా చదరపు అడుగుల ఫ్లాట్ల వాటా 4 శాతం చొప్పున ఉన్నది. అలాగే డిసెంబర్ అమ్మకాల్లో రూ.50 లక్షలలోపు ధరగల స్థిరాస్తుల వాటానే 60 శాతంగా ఉన్నది.
‘అత్యంత స్థితిస్థాపక మార్కెట్లలో హైదరాబాద్ ఒకటి. కరోనా ప్రభావ పరిస్థితుల్లోనూ ఇక్కడి రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆకర్షణీయంగా సాగుతున్నాయి. అటు వాణిజ్య, ఇటు నివాస సముదాయాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటున్నది. ముఖ్యంగా ఇండ్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మొత్తానికి గతకొద్ది త్రైమాసికాలుగా ఉత్సాహకర వాతావరణం కనిపిస్తున్నది. ఈ ఏడాది కూడా ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నాం’
-శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా