సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు, ఎస్హెచ్ఓలు, పెట్రోల్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో వీడియో కన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటలను దృష్టిలో ఉంచుకొని జోనల్ డీసీపీలు, సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ మండపాల వద్ద ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్లలో నిమజ్జనం చేయాలని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై నిఘా ఉంచామన్నారు. వదంతులను ఎవరూ నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.