సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలుగులో వచ్చిన గ్యాంగ్ సినిమాలో సీబీఐ ఆఫీసర్గా హీరో నటిస్తూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ, అమాయకులను నియమించుకుంటాడు. చివరకు అదంతా మోసమని తేలడంతో అమాయకులు లబోదిబోమంటారు. అలాగే.. సినీ ఫక్కీలో అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు వివరాలను వెల్లడించారు.
రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ సనహుల్హా అలియాన్ ఖాన్ సార్ 2007లో డిగ్రీ పూర్తి చేసి, ప్రైవేట్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. అలాగే, నెల్లూరుకు చెందిన పాలెం అశోక్కుమార్రెడ్డి అలియాస్ మనోజ్కుమార్ మరికొందరితో కలిసి 2017లో పాట్నాలోని ఎఫ్సీఐలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లారు. అక్కడ ఒక ముఠా వీరి వద్ద నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసింది. వీరంతా హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొన్నాళ్లు ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఇంతలోనే కరోనా వచ్చింది. ఇదిలా ఉండగా.. మహ్మద్ సనహుల్హా 2020 లాక్డౌన్ సమయంలో పంజాగుట్ట పోలీస్స్టేషన్కు సంబంధించిన నకిలీ స్టాంపును తయారు చేసి, దాని ద్వారా పాస్లు అందిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కొద్ది రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఉద్యోగాల వేటలో విసిగిపోయి..
లక్షలు పోగొట్టుకున్న అక్షపూర్ వీర చైతన్య, పాలెం అశోక్ కుమార్, గోడి వీర అర్జున్రావు, కోలకొండి రఘువీర్, తిరుమల అనిల్కుమార్ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా మహ్మద్ సనహుల్హా అలియాన్ ఖాన్ సార్ను కలిసి, నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు స్కెచ్ వేసి, అమలు చేశారు.
ఇన్కంట్యాక్స్ సర్వీసెస్ పేరుతో శిక్షణ
ఆదాయపన్ను శాఖలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. అమాయకులను తమ వద్దకు తీసుకొచ్చేందుకు కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. మాసబ్ట్యాంక్లోని యూఎన్ఐ బిల్డింగ్లోని రెండో అంతస్తులో ఇన్కం ట్యాక్స్ సర్వీసెస్ పేరుతో కార్యాలయాన్ని తెరిచారు. ఆ కార్యాలయం ఏర్పాటు చేసిన హాల్కు నెలకు రూ. 1.1 లక్షల అద్దెను చెల్లిస్తున్నారు. అందులో క్యాబిన్స్, 40 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయానికి సమీపంలోనే ఆదాయపన్ను శాఖ అసలు కార్యాలయ భవనం ఉంది. ఈ ముఠా వద్దకు వచ్చే నిరుద్యోగుల దగ్గర రూ. 3 నుంచి రూ.4 లక్షలు వరకు తీసుకొని, ఇన్కం ట్యాక్స్ కార్యాలయంలో ఉద్యోగం వచ్చినట్లు జాయినింగ్ లెటర్లు ఇచ్చారు. 79 మందికి నకిలీ జాయినింగ్ లెటర్లతో పాటు శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణ సమయంలో నెలకు రూ. 18 వేలు ఉపకార వేతనం కూడా చెల్లించారు. ఈ నకిలీ వ్యవహారం వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా బృందం దృష్టికి వచ్చింది. శిక్షణ పొందుతున్న వారి వద్ద ఉన్న జాయినింగ్ లెటర్లు సేకరించారు. ఆ లెటర్లను ఇన్కం ట్యాక్స్ అధికారులను చూపించారు. వాటిని చూసిన అధికారులు.. అవి నకిలీవంటూ తేల్చారు. ఆ తర్వాత శిక్షణ కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహించి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ఇన్కం ట్యాక్స్, రైల్వే, తదితర శాఖల ఉన్నతాధికారుల పేరుతో ఉన్న నకిలీ స్టాంపులు, రూ. 15.30 లక్షల నగదు, ఒక కారు, 288.87 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శిక్షణ ఇస్తున్న వారితో పాటు ఏజెంట్లుగా ఉన్న వారు పరారీలో ఉండగా.. ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు.
అగ్రికల్చర్ అసిస్టెంట్స్ పేరుతో..
నేషనల్ సాయిల్ కన్వర్జేషన్ అండ్ సాలినైజేషన్ బోర్డు (ఎన్ఎస్సీఎస్బీ.ఓఆర్జీ) కేంద్ర ప్రభుత్వ సంస్థ మాదిరిగా ఓ వెబ్సైట్ రూపొందించి..దానిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ. 500 వసూలు చేశారు. ఈ ప్రకటనను చూసిన 1420 మంది.. ఒక్కొక్కరు రూ. 500 చొప్పున చెల్లించారు. కొన్ని రోజుల తర్వాత అనుకున్నంత మంది రాకపోవడంతో రాత పరీక్ష రద్దు అయ్యిందని, విజయవాడ, మంగళగిరి ఐటీ పార్కులో వచ్చే నెలలో ఇంటర్వ్యూలు ఉంటాయని తేదీలు ప్రకటించారు. ఇంటర్వ్యూలకు వచ్చిన వారి నుంచి లక్షలు తీసుకొని, నకిలీ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే పోలీసులకు దొరికిపోయారు. అలాగే, సౌత్ సెంట్రల్ రైల్వేలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జిల్లాలో ఏజెంట్లను నియమించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో అమాయక ప్రజల నుంచి భారీగా వసూలు చేశారు. నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి, నకిలీ జాయినింగ్ లెటర్లు కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎస్సైలు కవీదుద్దీన్, మల్లికార్జున్, ఎంబీ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్కుమార్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.