మస్తుగ పైసలున్న మహిళలే ఆమె టార్గెట్.. రియల్ ఎస్టేట్లో భారీ లాభాలు చూపిస్తానని డబ్బు వసూలు చేస్తుంది.. కిట్టీ పార్టీలు పెట్టి ఖరీదైన మందు పోస్తుంది.. కాస్ట్లీ విల్లాలో ఉంటూ కార్లలో తిరుగుతుంది.. చీర కట్టిందంటే దాని ఖరీదు మినిమమ్ లక్ష ఉండాల్సిందే.. చూసేవాళ్లంతా నిజమేనని నమ్మేలా దర్పం ప్రదర్శిస్తుంది. నమ్మి డబ్బు చేతికిచ్చారో, నట్టేట ముంచుతుంది. అలా దాదాపు రూ.100 కోట్లు కొట్టేసింది శిల్పాచౌదరి అనే కిలేడీ. ముందుకురాని బాధితులు ఇచ్చిన మొత్తం మరో రూ.100 కోట్లు ఉంటాయని సమాచారం. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘరానా మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కిట్టీ పార్టీలు పెట్టి వందల కోట్లు కొట్టేసింది. లాభాలు వచ్చాయని లక్షలు చేతికి ఇచ్చింది. భారీగా లాభాలు వస్తున్నాయని కదా నమ్మి డబ్బు చేతిలో పెడితే, ఉత్త చేతులు చూపించింది. దాదాపు రూ.200 కోట్లు కొట్టేసిన ఓ కిలేడీని సైబరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన శిల్పాచౌదరి, భర్త తెల్ల కృష్ణశ్రీనివాస్ప్రసాద్ పదేండ్లుగా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని సిగ్నేచర్ విల్లాలో ఉంటున్నారు.
శిల్పాచౌదరికి సెలబ్రిటీ కావాలని కోరిక. దాన్ని నిజం చేసుకొనేందుకు బడా వ్యాపారులు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, అధికారులను టార్గెట్ చేసింది. ఓ లిస్టు తయారుచేసి డాబు, దర్పం చూపి మచ్చిక చేసుకొన్నది. కిట్టీ పార్టీలను ప్రారంభించి పేకాట, మద్యం పోసింది. రూ.లక్షలు ఖరీదైన మద్యం బాటిళ్లను కూడా పెట్టింది. ఏం చేస్తావని అడిగితే రియల్ ఎస్టేట్, సినిమా రంగంలో కోట్లు సంపాదిస్తున్నానని చెప్పేది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపితే ప్రతి నెల 10 శాతం లాభం ఇస్తానని నమ్మబలికింది.
ఆమె మాటలను నమ్మిన ఎంతో మంది కోట్ల రూపాయాలు పెట్టుబడిగా పెట్టారు. ఓ సీనియర్ ఐపీఎస్ మేనకోడలు రూ.5 కోట్లు, హైకోర్టు ఉన్నతాధికారి సోదరి రూ.6 కోట్లు ఇచ్చారు. తన స్నేహితురాలు దివ్యరెడ్డిని కూడా శిల్పాచౌదరి నమ్మించి రూ.కోటికి పైగా లాగేసింది. ఎంతకూ లాభం డబ్బు ఇవ్వకపోవటంతో నిలదీయగా, బౌన్సర్తో బెదిరించింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిందా బాధితురాలు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు శిల్పాచౌదరి రూ.100 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడినట్టు గుర్తించారు. ఆమె అరెస్టు విషయం బయటికి రావటంతో బాధితులు నార్సింగి పోలీసుస్టేషన్కు క్యూ కట్టారు. ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, కోర్టు అనుమతితో శిల్పాచౌదరిని విచారిస్తామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
రొటేషన్ ఆగిపోవటంతో..
వసూలు చేసిన డబ్బుతో స్థలాలు కొన్నానని చెప్పే శిల్పా చౌదరి.. ఆ మొత్తాన్ని సెలబ్రిటీగా చెలామణి అయ్యేందుకే ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. సహేరి పేరుతో ఓ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించినా, అది విడుదల కాలేదు. ఒకరి నుంచి తీసుకొన్న మొత్తాన్ని చెల్లించేందుకు మరొకరిని ట్రాప్ చేసేది. అలా రొటేషన్ నడిపిస్తూ కోట్లు వసూలు చేసింది. ఈ మధ్య రొటేషన్కు బ్రేక్ పడటంతో శిల్పాచౌదరి బాగోతం వెలుగులోకి వచ్చింది.
రూ.2వేల పెనం రూ.25 వేలకు..
శిల్పాచౌదరి తన భర్త ద్వారా రొట్టెల పెనం వ్యాపారం చేయించి, రూ.లక్షలు సంపాదించినట్టు తెలిసింది. ఆరోగ్యానికి మేలు చేసే పెనాన్ని తన భర్త అమ్ముతున్నాడని కిట్టీ పార్టీల్లో ప్రచారం చేసింది. దాన్ని జర్మనీ నుంచి తెప్పిస్తున్నాడని, దీనిపై వంట చేస్తే ఆయిల్ అవసరంలేదని నమ్మించింది. వాటిని రూ.2వేలకు కొని తన మాయమాటలతో రూ.25 వేలకు అమ్మింది. శిల్పాచౌదరి హంగు, ఆర్భాటాల మాయలో పడి చాలామంది మహిళలు ఎగబడి వీటిని కొన్నట్టు తెలిసింది.