హైదరాబాద్ : హైదరాబాద్-హుబ్లీ మధ్య విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్(GHIAL) బుధవారం హైదరాబాద్-హుబ్లీ మధ్య అలయెన్స్ ఎయిర్ విమాన సర్వీసును పున:ప్రారంభించింది. విమానాశ్రయ అధికారులు, ఇతర భాగస్వాముల సమక్షంలో అలయెన్స్ ఎయిర్ విమానం హైదరాబాద్ నుండి ఈ ఉదయం 6.35 గంటలకు బయలుదేరింది. ఈ సర్వీసుతో హైదరాబాద్ నుండి దేశీయ గమ్యస్థానాల సంఖ్య 57 కి చేరుకుంది. ఈ విమాన సర్వీసు వారానికి మూడుసార్లు సోమవారం, బుధవారం, శుక్రవారం నడుస్తుంది.
జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మరోసారి హుబ్లితో అనుసంధానమైనందుకు తాము సంతోషిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సన్నద్ధంగా ఉందన్నారు. టైర్-2, టైర్-3 నగరాలకు విమాన కనెక్టివిటీని పెంచడానికి భారత ప్రభుత్వం ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద ప్రారంభించిన ఈ సేవలు మెట్రోలతో కనెక్టివిటీని తిరిగి స్థాపించడంలో చాలా కీలకమైనవన్నారు.
అలయెన్స్ ఎయిర్ సీఈఓ హర్ ప్రీత్ మాట్లాడుతూ.. అలయెన్స్ ఎయిర్ ప్రత్యేకమైన రూట్లు, ప్రత్యేకమైన గమ్యస్థానాలతో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను ఏకం చేస్తుందన్నారు. ఉడే భారత్, జుడే భారత్, ఆత్మనిర్భర్ బనే భారత్’’’ అన్నారు. హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారంలాంటిదన్నారు. ఇది సమీపంలోని విజయవాడ, విశాఖపట్నం, నాగ్పూర్, రాజమండ్రి, తిరుపతి, బీదర్ నగరాల నుండి వచ్చే ప్రయాణీకులకు అనుకూలంగా ఉండే విమానాశ్రయం అన్నారు.