న్యూఢిల్లీ: హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి చేరబోతున్నది. విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. భాగ్యనగరం వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసు అభిమానులను అలరించనుంది. ఈ మేరకు ఫార్ములా-ఈ, ఎఫ్ఐఏ రానున్న సీజన్ (2022-23) కోసం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. బద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఢిల్లీ)లో 2013లో ఫార్ములావన్ ఇండియన్ గ్రాండ్ప్రి రేసు తర్వాత ఇన్నేండ్లకు భారత్ వేదికగా రేసు జరుగబోతున్నది. తొమ్మిదో సీజన్లో భాగంగా రౌండ్-4 చాంపియన్షిప్ హైదరాబాద్లో జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా-ఈ ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.దీని ప్రకారం హైదరాబాద్కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ర్టాన్ని హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఫార్ములా-ఈ రేసు ద్వారా మరింత చేరువ కావాలని చూస్తున్నది. దీనికి తోడు హైదరాబాద్ రేస్ ద్వారా దేశ మోటార్ స్పోర్ట్స్కు మంచి జోష్ రానుంది. హైదరాబాద్లో జరిగే ఫార్ములా-ఈ రేసును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్పై స్పందిస్తూ ‘వెల్కమ్ ఫార్ములా-ఈ టు హ్యాపెనింగ్ హైదరాబాద్’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.