కవాడిగూడ, అక్టోబర్ 26: భోలక్పూర్ డివిజన్లో నాడు అధ్వానంగా ఉన్న రోడ్లు నేడు అందంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు గత కొన్నేండ్లుగా గుంతల మయం కావడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు నరకయాతన పడేవారు. చిన్న వాన పడిందంటే అంతే సంగతులు ఇక రోడ్లన్నీ చిత్తడయి ప్రమాదాలు జరుగుతుండేది. కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్లో నూతనంగా వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి భోలక్పూర్లో రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు. డివిజన్లోని పలు బస్తీలు, కాలనీలలో నూతనంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు. డివిజన్లోని ఇందిరానగర్, సుప్రీం హోటల్ మండీగల్లీ, అంజుమన్ స్కూల్ ప్రాంతం, పద్మశాలీ కాలనీ, పీఅండ్టీ కాలనీ, కత్నీకాంఠ తదితర బస్తీలు, కాలనీలలో సీసీ రోడ్లను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించారు.
భోలక్పూర్ డివిజన్లో రూ. 20 కోట్లతో తాగు నీటి, శిథిలమైన డ్రైనేజీ పైప్లైన్ల తొలగించి నూతన పైప్లైన్ల నిర్మాణం, కచ్చానాలా నిర్మాణం పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించిన విషయం తెలిసిందే. రూ.15 కోట్లతో తాగునీటి పైప్లైన్, రూ.5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి భోలక్పూర్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే భోలక్పూర్ శాశ్వత సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భోలక్పూర్లో గతంలో రోడ్లన్ని అధ్వానంగా ఉండేవి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవతోనే డివిజన్లో సీసీ రోడ్లు వేయడం జరుగుతున్నది. నూతనంగా డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల ఏర్పాటు వలన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగింది. డివిజన్లోని అన్ని బస్తీలలో సీసీ రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. రోడ్ల నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తున్నాం..
– తిరుపతి, ఏఈ జీహెచ్ఎంసీ