హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగారం లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఎంబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుకేశ్ గుప్తాకు హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. పలు షరతులు కూడా విధించింది. ఈ నెల 14న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈడీ విచారణకు హాజరుకావాలని తెలిపింది. తర్వాత కూడా అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని.. పాస్ పోర్టును కూడా విచారణ అధికారికి సరెండర్ చేయాలని ఆదేశించింది. అలాగే ఐదు వారాల పాటు ప్రతి సోమ, బుధవారాల్లో ఈడీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని పేరొంది. అలాగే సుకేశ్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని అధికారులను ఆదేశించింది. సుకేశ్ షరతులను ఉల్లంఘిస్తే.. ఈడీ ముందస్తు బెయిల్ను రద్దు కోరవచ్చని సూచించింది. ఎంబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ సుకేశ్ గుప్తాతోపాటు మరికొందరిపై 2014, ఫిబ్రవరి 25న మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాలు నమోదు చేసింది. రూ. 190 కోట్ల బంగారం కొనుగోళ్ల లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేరొంది. తాజాగా తమ ముందు విచారణకు హాజరుకావాలని సుకేశ్తోపాటు ఇతరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ఈ కేసులో ఏ-1గా ఉన్న సుకేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సురేందర్ విచారణ చేపట్టారు. ఈడీ తరఫున బి. నర్సింహాశర్మ వాదనలు వినిపించారు. 2015 నుంచి ఇప్పటివరకు పదహారుసార్లు సుకేశ్కు సమన్లు ఇచ్చామని, అతను మాత్రం కేవలం ఒకసారే విచారణకు హాజరయ్యారని వివరించారు. విచారణకు కూడా సరిగా సహకరించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సుకేశ్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.