దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పదిరోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న ఆదిపరాశక్తి నిమజ్జనోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నగరవ్యాప్తంగా ప్రతిష్టించిన వందలాది విగ్రహాలను హుసేన్సాగర్తో పాటు ఆయా తటాకాల్లో నిమజ్జనం చేశారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైంది. నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజా, ఎన్టీఆర్మార్గ్, జలవిహార్ ప్రాంతాల్లో నిమజ్జన ఘాట్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. సాగర్లో నిమజ్జనమైన ప్రతిమల అవశేషాలను హెచ్ఎండీఏ తొలగిస్తుండగా, ఒడ్డున పడిన వాటిని జీహెచ్ఎంసీ సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నది.
జీహెచ్ఎంసీ నెక్లెస్రోడ్ పీవీమార్గ్లోని పీపుల్స్ప్లాజాలో ఆరు క్రేన్లు, ఎన్టీఆర్మార్గ్లో నాలుగు, జలవిహార్ బేబీపాండ్లో మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అవశేషాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు 300 మంది సిబ్బందిని కేటాయించింది. వ్యర్థాలను తీసేందుకు 10కి పైగా టిప్పర్లు, బాబ్ క్యాట్ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నాలుగు క్రేన్లను నామమాత్రంగా వినియోగిస్తుండగా, మిగతా వాటి ద్వారా ముమ్మరంగా నిమజ్జనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజల సహకారంతో దసరా ఉత్సవాలు, దుర్గామాత నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.