సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) :ఆంధ్ర నుంచి గంజాయిని హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ర్టాలకు డీసీఎంలో సరఫరా చేస్తున్న ఇద్దరిని హయత్నగర్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.8 కోట్ల విలువైన 1300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈస్ట్గోదావరి జిల్లా మారేడ్మల్లికి చెందిన పెంటారావు గంజాయి అందిస్తుండగా దానిని ఛత్తీస్గఢ్కు చెందిన రాజేశ్కుమార్ హైదరాబాద్, మధ్యప్రదేశ్తో పాటు వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుంటాడు. గతంలో మధ్యప్రదేశ్కు చెందిన నరేంద్ర హరిజన్, రాజేశ్ వద్ద సంవత్సరం కిందట పనిచేశాడు.
దీంతో రాజేశ్, హరిజన్తో గంజాయి సరఫరా చేయిస్తూ ఒక్కో ట్రిప్పుకు రూ.50 వేలు ఇస్తూ వచ్చాడు. ఇటీవల హరిజన్కు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇవ్వడంతో జై హంబి ట్రాన్స్పోర్టు పేరుతో కార్యాలయం తెరిచాడు. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రేశ్సాకేత్ను తాజాగా డ్రైవర్గా నియమించారు. సూపర్ వైజర్కు ఒక్కో ట్రిప్పుకు లక్ష రూపాయలు, డ్రైవర్కు రూ.50 వేలు ఇస్తూ రాజేశ్ గంజాయి రవాణా చేయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీన సీజీ 07 సీజీ 8878లో పెంటారావు వద్దకు వెళ్లారు. అక్కడ 40 గంజాయి బస్తాల్లో 1300 కిలోల గంజాయిని డీసీఎంలో లోడ్ చేసుకొని హైదరాబాద్ వైపు వస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో హయత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బృందం అంబర్పేట్ వద్ద డీసీఎంను ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు నరేంద్ర హరిజన్, చంద్రేశ్ సాకేత్లను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.