మేడ్చల్ రూరల్,అక్టోబర్ 6: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన సర్వీసు రిజర్వాయర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బాహ్య వలయ రహదారి ఆవల ఉన్న ప్రాంతాల తాగునీటి సౌకర్యానికి రూ.1200కోట్లతో చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టులో భాగంగా హెచ్ఎండీఎస్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది. ఈ రిజర్వాయర్తో పాటు పైపులైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సౌకర్యం కల్పనకు రూ.13.5 కోట్లతో నీటి సరఫరా వ్యవస్థను హెచ్ఎండబ్ల్యూస్ నిర్మిస్తోంది. రూ.2.5 కోట్లతో 10 లక్ష లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న జీఎల్ఎస్ఆర్(గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజ్వరాయర్), 10లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ఈఎల్ఎస్ఆర్(గ్రౌండ్ లెవర్ సర్వీసు రిజర్వాయర్) నిర్మాణం చేస్తున్నారు. జీఎల్ఎస్ఆర్ను సంప్గా వినియోగిస్తారు. అక్కడి నుంచి ఈఎల్ఎస్ఆర్కు నీటిని పంప్ చేసి, పైపులైన్ ద్వారా ఇండ్లకు నీటిని సరఫరా చేస్తారు. రూ.11 కోట్లతో 50కిలో మీటర్ల పైపులైన్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 15 కిలో మీటర్ల వరకు పైపులైన్ వేశారు. మిగితా పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. పైపులైన్ను మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ,గుండ్లపోచంపల్లి, బాసరేగడి, జ్ఞానాపూర్, అర్కెలగూడ,కండ్లకోయలో పైపులైన్ను ఏర్పాటు చేస్తున్నారు.
మైసమ్మగూడలో నిర్మిస్తున్న సర్వీస్ రిజర్వాయర్ల ద్వారా దాదాపు 3000ఇండ్లకు ప్రయోజనం చేకూరనుంది. మైసమ్మగూడ, గుండ్లపోచంపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి కొంపల్లి దారిలో నైబర్హుడ్ వరకు, మరోవైపు అయోధ్య క్రాస్ రోడ్డు వరకు నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం హెచ్ఎండబ్ల్యూఎస్ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన చిన్న చిన్న ట్యాంక్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది.దీనివల్ల పూర్తిస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదు. 20లక్షల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్న సర్వీస్ రిజర్వాయర్లతో సరఫరా మెరుగుపడనుంది. అయితే జ్ఞానాపూర్, బాసరేగడిలకు అయో ధ్య క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మెయిన్ పైపులైన్ నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. అర్కెలగూడ, కండ్లకోయలకు శామీర్పేటలో నిర్మిస్తున్న రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా జరుగుతుంది.హెచ్ఎండబ్ల్యూఎస్ మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం 1100 ఇండ్లకు నీటిని సరఫరా చేస్తుండగా, మైసమ్మగూడ రిజర్వాయర్తో ఆ సంఖ్య 4వేల వరకు చేరనుంది.
మైసమ్మగూడలో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న రెండు సర్వీస్ రిజర్వాయర్లు డిసెంబర్లోగా పూర్తి అవుతాయని హెచ్ఎండబ్లూఎస్ డీజీఎం త్రినాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 15 కిలో మీటర్ల మేరకు పైపులైన్ పనులు పూర్తి కాగా మరో 35 కిలో మీటర్ల మేరకు పైపులైన్ పనులు వేయాల్సి ఉంది. ఆ పనులను జూన్ వరకు పూర్తి చేస్తామన్నారు. నీటి సరఫరా వ్యవస్థ జూన్ 23 వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ వ్యవస్థతో ఒక్కో ఇంటికి రోజు విడిచి రోజు 1000 లీటర్ల నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రూపాయికే కనెక్షన్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు హెచ్ఎండీఎస్ నీటి వినియోగిస్తున్న 1100మందితో పాటు భవిష్యత్లో వినియోగించే వారు నెలనెలా బిల్లులు చెల్లించి, మెరుగ్గా నీటి సరఫరాకు సహకరించాలని ఆయన కోరారు.
ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మౌలి క సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తుంది.రోడ్లు, డ్రైనేజీ,నీరు తదితర సౌకర్యాలకు భారీగా నిధు లు అందజేస్తుంది. మైసమ్మగూడలో నిర్మిస్తున్న రిజర్వాయర్లతో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీరుతుంది. ప్రభుత్వం ఆశయం మేరకు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం.మంత్రి మల్లారెడ్డి సహకారంతో అన్ని వార్డుల్లో నగర స్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నాం.
-మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి