కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 5 : కేపీహెచ్బీ కాలనీలో శరన్నవరాత్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు ప్రత్యేక పూజలు చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ప్రజలంతా కష్టాలు పడ్డారని ఈ యేడాది ప్రజలు సంతోషంగా దసరా పండుగ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, బుట్టో రాంబాబు, నూతి రాంబాబు నాయుడు, వాసు నాయుడు, గఫూర్ తదితరులున్నారు.
కనకదుర్గా దేవాలయంలో..
కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని శ్రీకనకదుర్గా దేవాలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా ప్రజలకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా ఆయలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బైరెడి గోపాల్రెడ్డి, ప్రెసిడెంట్ బైరెడ్డి రాధికారెడ్డి, కమిటీ సభ్యులు కృష్ణారావు, బొక్క బాలయోగి, గౌరీశంకర్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, షణ్ముఖ శర్మ తదితరులున్నారు.
వాసవీ దేవాలయంలో..
కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో రాజరాజేశ్వరీ దేవి అలంకరణాతో వాసవీ అమ్మవారు ప్రజలకు దర్శమిచ్చారు. దసరా సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు శమీపూజలు చేశారు. భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. నేడు పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో..
కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లోని ఉమారామలింగేశ్వరస్వామి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. దసరా సందర్భంగా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
సాయినాగేంద్రాలయంలో వేడుకలు
బాలానగర్, అక్టోబర్ 5 : బాలానగర్ డివిజన్ పరిధి సాయినగర్లోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరాలయం 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివార్లకు ప్రత్యేక అంలకరణ, పూజలు అంగరంగా వైభవంగా జరిగాయి. స్వామి వారికి నిత్య హోమము, బలిహరణం, అభిషేకం, సామూహిక కల్యాణం సాయంత్రం గరుడ వాహనంపై సాయినగర్ పుర వీధులలో స్వామివారి ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
సాయినగర్లో సాయినాగేంద్రాలయంలో స్వామివారి 104వ సమాది దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో లక్ష పుష్పార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అంబటి సునిల్కుమార్ గుప్తతో పాటు ఇతర కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప పూజలు చేశారు.
బాలానగర్లో..
బాలానగర్ పారిశ్రామికవాడలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఫతేనగర్ డివిజన్ పరిధి జవహర్నగర్కాలనీలోని కనకదుర్గాదేవి, శీతాలాదేవి, కాళికాదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.