మణికొండ/శంషాబాద్ రూరల్, అక్టోబర్ 5: విజయ దశమి పండుగ వేడుకలు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బుధవారం ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా పండుగను జరుపుకున్నారు. కొత్త బట్టలు ధరించి పాలపిట్టను దర్శించుకుని ఊరూవాడ ముస్తాబై శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మైదానంలో రావణ దహనాన్ని చేసి అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటూ నమస్కారంతో దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని గండిపేట, శంషాబాద్ ,రాజేంద్రనగర్ మండలాల పరిధిలోని అన్నిగ్రామాల్లో దసరా పండగ ఉత్సవాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
విజయదశమి సందర్భంగా శంషాబాద్ మండలంలోని నర్కూడ, సుల్తాన్పల్లి, కేబిదొడ్డి, మల్కారం, రామంజాపూర్, కవ్వగూడ, పెద్దషాపూర్, ఘాన్సిమియాగూడ, పాలమాకుల, పెద్దతూప్ర, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ , హమిదుల్లానగర్ గ్రామాలలో బుధవారం విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
విజయదశమి సందర్భంగా శంషాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు జమ్మి చెట్టు వద్దకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరు సంతోషంగా ఉండే విధంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్సుష్మ, గణేశ్గుప్త, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, కౌన్సిలర్లు అజేయ్, కుమార్, శ్రీకాంత్యాదవ్, విజయలక్ష్మీ, నాయకులు మురళియాదవ్, శ్రీనివాస్లతో పాటు పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.