సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : గులాబీ అధిపతి, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తున్న వేళ సంబురాలకు గ్రేటర్ టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. డివిజన్, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పటాకుల పేలుళ్లు, డప్పు వాయిద్యాలు, కలర్ ఫుల్ వాతావరణంలో వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీపై ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దాదాపు అరగంట పాటు గులాబీ సైన్యం ఎక్కడివారక్కడ పెద్ద ఎత్తున హర్షాతికాలు వ్యక్తం చేస్తూ సంబురాలు చేయాలని నిర్ణయించారు. విజయాలను అందించే విజయ దశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్నారని, భవిష్యత్తులోనూ సీఎం కేసీఆర్కు అన్ని విజయాలే వరించాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ప్రధానంగా తెలంగాణ భవన్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్తో పాటు బంజారాహిల్స్ రోడ్ నం.14 , మరికొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ‘బీఆర్ఎస్’ పేరిట ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక తలసాని సాయి కిరణ్యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సాంస్కృతిక కార్యక్రమాలు, హైడ్రాలిక్ పద్ధతిలో జాతీయ పార్టీ లోగో ప్రదర్శన, త్రీడీ వాల్ ప్రదర్శన ఆకట్టుకోనున్నది.