సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఐటీ కారిడార్లో కలిసే నానక్రాంగూడ ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు పొడవునా ఇంటర్ చేంజ్ల నిర్మాణాలపై ఆ చుట్టు పక్కల ప్రాంతాల ప్రత్యేకతలను పరిగణలోకి తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ సైజులో ఉన్న మనిషి సేద తీరుతూ కూర్చున్న శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు జంక్షన్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు మార్పులు చేశారు. రోటరీలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రకటనలు వచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన వేదికను మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సీఎస్ అర్వింద్కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అత్యంత రద్దీ మార్గాల్లో నానక్రాంగూడ జంక్షన్ కూడా ఒకటిగా ఉన్నదని, భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత కలిగిన జంక్షన్గా మారుతున్న నేపథ్యంలో జంక్షన్లో ప్రత్యేక థీమ్లతో ఆధునీకరించామని తెలిపారు. ఇప్పటికే నానక్రాంగూడ జంక్షన్ నుంచి మై అవతార్ వరకు ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లపై వన్వే ట్రాఫిక్ను అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ నుంచి రెండు చోట్ల ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లను కలిపే విశాలమైన లింకు రోడ్లను ఇప్పటికే పూర్తి చేసి ప్రారంభించామని అర్వింద్కుమార్ పేర్కొన్నారు. నానక్రాంగూడలో ఐటీ కార్యకలాపాలకు చెందిన భారీ బహుళ అంతస్థుల భవనాలే కాకుండా నివాస ప్రాంతాలు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో జంక్షన్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టామని తెలిపారు.