బంజారాహిల్స్, అక్టోబర్ 2: బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడో కామాంధుడు.. ఆమెను ప్రేమపేరుతో లోబర్చుకున్నాడు మరో దుర్మార్గుడు. వారి దాష్టీకంతో గర్భం దాల్చిన బాలిక శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పుట్టిన బాబుకు మూడునెలల వయస్సు దాటిన తర్వాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటగిరిలో నివాసముంటున్న బాలిక (16) తల్లితో పాటు ఇండ్లలో పనిచేస్తుంటుంది. కాగా, అదే ప్రాంతంలో నివాసముంటున్న సాయికుమార్(25) బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలిక పనిచేస్తున్న ఇంటి పక్కన వాచ్మన్గా పనిచేస్తున్న నేపాల్కు చెందిన బుద్దిమాన్ కామే(53) బాలికతో మాటలు కలిపి గదిలోకి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన ఆహారపదార్థాలు ఇచ్చేవాడు. వాటిని తిన్న తర్వాత మత్తులోకి వెళ్లిన బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే విధంగా.. సాయికుమార్ సైతం ఆమెను ప్రేమ పేరుతో లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో బాలిక గర్భం దాల్చింది. సుమారు 6 నెలల గర్భంతో కనిపించిన బాలికను గుర్తించిన ఆశ వర్కర్లు.. ఈ సమాచారాన్ని చైల్డ్వెల్ఫేర్ అధికారులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఈ వ్యవహారం జూబ్లీహిల్స్ పోలీసుల దృష్టికి రావడంతో బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరిని గతనెలలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అప్పటినుంచి బాధితురాలు స్టేట్హోమ్లో ఉంది.. బాధిత బాలిక శనివారం నాడు నిలోఫర్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక గర్భం దాల్చేందుకు కారణం ఎవరనే విషయాన్ని తేల్చేందుకు నిందితులిద్దరితో పాటు పుట్టిన బాబుకు సంబంధించిన డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.