బంజారాహిల్స్: ఇటీవల నిర్వహించిన ఆదివాసీ, గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయడంతో నగర వ్యాప్తంగా గిరిజనులు, గిరిజన సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు గిరిజనులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలు గిరిజన సంఘాల నేతలు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు పెంచాలంటూ గతంలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఏండ్లుగా ఆమోదించకుండా గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందన్నారు. గిరిజనులపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్కు జీవోను జారీ చేశారని అన్నారు. కేసీఆర్కు గిరిజనులంతా రుణపడి ఉంటామని వారు ప్రతినబూనారు. ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ జీవో జారీ చేయడంతో వేంకటేశ్వరకాలనీ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాందాస్ చౌహాన్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే దానం నగేందర్, కార్పొరేటర్ కవితారెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ: గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడంతో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆల్ఇండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కరాటే రాజునాయక్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో క్షీరాభిషేకం నిర్వహించారు.
జీఓ జారీని స్వాగతిస్తున్నాం
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్జారీ చేసిన జీవోను స్వాగతిస్తున్నాం.అట్లాగే 56 శాతం ఉన్న బీసీలకు 25 శాతమే రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. వాటిని కూడా జనాభా దామాషా ప్రకారం పెంచాలి.
– బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్