సికింద్రాబాద్, అక్టోబర్ 1: పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి పెండ్లి కానుక అందిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శనివారం నియోజకవర్గం పరిధిలోని పలు వార్డులకు చెందిన 12 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సాయన్న చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి గొప్ప కానుకగా ప్రజలు భావిస్తున్నారన్నారు.
ఒక సంఘటన ముఖ్యమంత్రి కేసీఆర్లో ఆలోచనను రగిలిస్తే, అదే ఆలోచన నేడు లక్షలాది మంది ఆడబిడ్డలకు ఒక గొప్ప వరంగా మారిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఆడపిల్లల పెండిళ్లకు ఆర్థిక చేయూత నిచ్చినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మండ ల తాసీల్దార్ హాసీనా బేగం, బోర్డు మాజీ సభ్యులు అనితాఫ్రభాకర్, మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు సదానంద్గౌడ్, తేజ్పాల్, శంకర్, నిత్యానంద్ పాల్గొన్నారు.
రూ.3లక్షల ఎల్వోసీ అందజేత ..
నిరుపేదల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సా యన్న అన్నారు. నియోజకవర్గానికి చెందిన శ్వేత అనే యువతికి కిడ్నీలు పాడవడంతో నగరంలోని నిమ్స్లో శస్త్ర చికిత్స చేయించుకున్నది. ఈ క్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నకు సమాచారం అందించగా సీఎంరిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. దీంతో రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరైంది. ఈ నేపథ్యంలో ఎల్వోసీని శనివారం లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులకు కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, టీఆర్ఎస్ నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, సదానంద్గౌడ్, భాస్కర్ ముదిరాజ్, అంజనేయులు పాల్గొన్నారు.
అనంతరం సికింద్రాబాద్ శివాజీనగర్లోని శ్రీ పెరుమాల్ వేంకటేశ్వరస్వామిఆలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబసమేతంగా బ్రహోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే సాయన్నకు స్వాగతం పలికారు.