సిటీబ్యూరో, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో మరో భారీ విగ్రహం ఆవిష్కరణ కానుంది. అసెంబ్లీ మాదిరిగా ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో హెచ్ఎండీఏ అధికారులు నెలకొల్పారు. విగ్రహం పరిసర ప్రాంతాలన్నీ పచ్చని అందాలతో కనువిందు చేసేలా సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందుకోసం కోటి రూపాయలు ఖర్చు చేశారు. సివిల్, ఎలక్ట్రికల్, 200 మీటర్ల విస్తీర్ణంలో గ్రీనరీ పనులతో పాటు లైటింగ్, ఫెన్సింగ్, ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. ఘనమైన చరిత్ర కలిగిన గాంధీ దవాఖాన వద్ద కొలువుదీరిన ఈ భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. కాగా ఎంజీ రోడ్లో రూ. 1.36 కోట్లతో గాంధీ పార్క్ను ఏర్పాటు చేశారు.
10.30 గంటలకు ఆవిష్కరణ
గాంధీ హాస్పిటల్ ఎదుట ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిషరిస్తారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న 16 ఫీట్ల గాంధీ విగ్రహ పనులను, బహిరంగ సభ జరిగే ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, ఐజీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు, ఐ అండ్ పీఆర్ సీఐఈవో రాధాకృష్ణ, ఆర్ అండ్ బీఎస్ఈ హఫీజుద్దీన్, ఆర్డీవో వసంత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు నగర్ టీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.