పీర్జాదిగూడ, అక్టోబర్1 : చెడు వ్యసనాలకు అలవాటైన ఓ యువకుడు చోరీలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగాలు చేసే దంపతుల ఇండ్లే టార్గెట్ చేసుకొని.. వారు తాళం చెవిని ఎక్కడ పెడుతున్నారో గుర్తించి.. దోచుకుంటున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన మేడిపల్లి పోలీసులు అతడి నుంచి 13.5 తులాల బంగారు ఆభరణాలు, 58 తులాల వెండి వస్తువులు, రూ.35 నగదు, బైకును స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ నరేశ్రెడ్డి, మేడిపల్లి సీఐ గోవర్ధనగిరితో కలిసి వివరాలను వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా, గొంద్వాల గ్రామానికి చెందిన మహ్మద్ సుభాన్(25) కుటుంబసభ్యులతో కలిసి పీర్జాదిగూడ రామకృష్ణానగర్ కాలనీలో ఉంటున్నాడు. చిన్నప్పుడే దొంగతనాలు చేసి జువైనల్ హోంకు వెళ్లి వచ్చాడు.
ఓ సంస్థలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. చెడు అలవాట్లకు వచ్చే సంపాదన సరిపోక, అప్పులు కూడా ఉండటంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. డెలివరీ బాయ్గా పనిచేసే సమయంలో ఉద్యోగాలు చేసే దంపతుల ఇండ్లను గుర్తించేవాడు. ముఖ్యంగా ఎవరైతే తాళం చెవిని ఏదైనా చోట దాచి పెట్టి వెళ్తుంటారో వారిని గమనించేవాడు. వారు డ్యూటీకి వెళ్లాక తాళం చెవిని తీసుకొని..ఆ ఇంట్లో దొంగతనం చేసి.. మెల్లగా జారుకునేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా తాళం చెవిని యథాస్థానంలో పెట్టేవాడు. దొంగిలించిన విలువైన బంగారు ఆభరణాలను వివిధ సంస్థల్లో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం మేడిపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుభాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలను ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.