సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ విద్యలో ఎమర్జింగ్ కోర్సులకు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు ఎంసెట్ సీట్ల కేటాయింపు విధానం ద్వారా స్పష్టమవుతోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్తో పోల్చితే.. ఎమర్జింగ్ కోర్సులైన డేటాసైన్స్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చైన్ వంటి స్పెషల్ కోర్సులు బోధించేందుకు టీచింగ్ ఫ్యాకల్టీల కొరత పట్టి పీడుస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా మార్కెట్ డిమాండ్, సాఫ్ట్వేర్ రంగంతో సీఎస్ఈలో ప్రత్యేక కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ.. ఆ కోర్సులు బోధించే నిష్ణాతులైన ఫ్యాకల్టీలు లభించడం లేదు.
సీఎస్ఈలో స్పెషలైజేషన్ కోసం పలు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఫ్యాకల్టీ లభించడం లేదు. ఫ్యాకల్టీ లేని కాలేజీలకు యూనివర్సిటీలు అఫిలియేషన్లు నిలిపిస్తున్నాయి. దీంతో, ఆయా కోర్సులను మెల్లగా తగ్గించుకునే దాఖలాలు ఉన్నాయని జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. అయితే ఫ్రాఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీఎస్ఈ స్పెషలైజేషన్కు లేకపోవడం వల్ల విద్యార్థులకు కూడా నాణ్యమైన బోధన అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవని, దీంతో విద్యార్థులు భవిష్యత్లో నైపుణ్యం కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయంటున్నారు. అదే క్రమంలో కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులకు మాత్రం టీచింగ్ ఫ్యాకల్టీ అందుబాటలో ఉందన్నారు.
దీంతో యాజమాన్యాలు కూడా తిరిగి సీఎస్ఈ లోనే సీట్లు పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంజినీరింగ్లో 45 బ్రాంచుల్లో కలిపి కన్వీనర్ కోటాలో మొత్తం 71,286 సీట్లు ఉన్నాయి. వాటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో 18,682 సీట్లు అనుమతి ఉండగా.. వాటిలో 18,666 సీట్లు నిండాయి. ఐటీలో 5,036 సీట్లు ఉండగా 5,024 సీట్లు నిండాయి. ఏఐఎంఎల్లో 7737 సీట్లు ఉండగా 7439 సీట్లు నిండాయి. మిగితా డేటా సైన్స్, ఐవోటీ, బ్లాక్చైన్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో కేవలం ట్రిపుల్ డిజిట్లోనే సీట్లు ఉన్నాయి.