సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిబంధనలు పాటించని, గుర్తింపు లేని ప్రైవేటు దవాఖానలపై వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1087 దవాఖానల్లో అధికారులు తనిఖీలు జరిపినట్లు గ్రేటర్ వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో గుర్తింపు లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న 26 దవాఖానలను సీజ్ చేశారు. 241 వైద్యశాలలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు.
మరో 8 దవాఖానలకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. నకిలీ వైద్యులు, రిజిస్ట్రేషన్ లేకుండా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, అర్హత లేని వైద్యులతో చికిత్స అందించడం, నిబంధనలు పాటించకుండా దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లను నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు హెచ్చరించారు.