రాకపోకలకు అంతరాయం లేకుండా నగర ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా నగర పోలీసులు ‘ఆపరేషన్ రోప్’ అమలు చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించనున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. సిగ్నళ్ల వద్ద స్టాప్లైన్ దాటిన వారికి రూ.200, ఫ్రీ లెఫ్ట్ను బ్లాక్ చేసిన వారికి రూ.1000 జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. రోడ్డుపైన వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగించే వారికి 1000 రూపాయల వరకు జరిమానా విధించనున్నామని, అడ్డదిడ్డంగా పార్క్ చేస్తే వాటిని టోయింగ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫుట్పాత్లు, క్యారేజ్వేలు అక్రమించవద్దని ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేలా నగరవాసులు సహకరించాలని కోరారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి పట్టుకోవడం కోసం ఇక నుంచి తరచూ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని రెండు రోజుల ముందే ప్రకటన జారీ చేస్తారు. ఆ తరువాత కూడా ఉల్లంఘనలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. హెల్మెట్, సీట్బెల్ట్, రాంగ్సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, బ్లాక్ ఫిలిమ్స్, త్రిబుల్ రైడింగ్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఎక్కువ తీవ్రత ఉన్న ఉల్లంఘనలపై దృష్టి సారిస్తున్నారు. అయితే డ్రైవ్ నిర్వహించే ముందే ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నా, వెనుక కూర్చున్న వారు మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను వాహనదారులకు వివరిస్తూ, వెనుక ముందు కూర్చున్న వారు కూడా సీట్బెల్ట్ పెట్టుకునేలా చర్యలు తీసుకుంటారు.
నగర పోలీసులు పటిష్ట ప్రణాళికతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రోప్(రిమూవల్ ఆఫ్ అబస్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్)ను అమలు చేస్తున్నారు. దీంతో పాటు అన్ని వర్గాల వారిలో అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ఎన్ఫోర్స్మెంట్పై ఫోకస్ పెట్టారు. అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ విభాగానికి ప్రత్యేకంగా సోషల్మీడియా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన సోషల్మీడియా ఫ్లాట్ ఫామ్కు ఉన్న ఫాలోవర్స్ సంఖ్యను ప్రత్యేక వింగ్ ద్వారా పెంచాలని భావిస్తున్నారు. అలాగే వీఎంఎస్(వెర్యేబుల్ మేసేజ్ సైన్) బోర్డులు, పీఏ(పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్) ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచనున్నారు.
ట్రాఫిక్ విభాగానికి ఉన్న సోషల్మీడియా ఫాలోవర్స్
ఫేస్బుక్ – 3.5 లక్షలు
ట్వట్టర్ – 1.9 లక్షలు
వీఎంఎస్బోర్డ్స్ – 66
పీఏ సిస్టమ్స్ – 47