ఆర్కేపురం, సెప్టెంబర్ 30: చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి షీక్యాబ్స్ వాహనాలను అందజేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. శుక్రవారం సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ మైదానంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీక్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి చేస్తున్న కృషిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ప్రాజెక్టు కింద 23 మంది దిళిత మహిళలకు షీక్యాబ్స్ వాహనాలను అందజేశామని తెలిపారు. రాష్ట్రం ప్రభు త్వం అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ వారు ఆర్థికంగా బలోపేతం చెందే లా కృషి చేస్తున్నదని తెలిపారు. రైతులకు రైతు బందు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అందజేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అండగా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
అదే విధంగా ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళలు షీక్యాబ్స్ను ఉపయోగించుకునేవిధంగా దళితల మహిళలకు ఉపాధి కల్పించేందుకు అర్హులైన వారిని గుర్తించి వారికి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించి మహిళలకు షీక్యాబ్స్ అందజేశామని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 500 మందికి ఈ పథకాన్ని అందజేస్తున్నామని అన్నారు. షీ క్యాబ్స్ లబ్ధిదారులైన మహిళలను అభినందిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ మిగతా మహిళలకు ఆదర్శంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనలర్ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్ కుమార్, నాయకులు బేర బాలకిషన్, లోకసాని కొండల్రెడ్డి, ఇంటూరి అంకిరెడ్డి,పారుపల్లి దయాకర్రెడ్డి, మహేందర్యాదవ్, సిరిపురం రాజేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన బంధు పథకాన్ని ప్రకటించి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి పంచాయతి పరిధిలోని గుమ్మడవెల్లి తండాకు చెందిన గిరిజన మహిళలు డైరెక్టరు దేవీలాల్ ఆధ్వర్యంలో మంత్రి నివాసానికి చేరుకొని సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్న లంబాడి దుస్తులను ధరించి నృత్యాలు చేస్తూ మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలువడంతో ఇతర రాష్ర్టాలు మన పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టి గిరిజనల గుండెల్లో చెరుగని ముద్రవేసినట్లు చెప్పారు. గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నా ప్రతి పక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు.వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను కోరిన వెంటనే మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, రైతు బందు అధ్యక్షుడు క్రిష్ణారాంభూపాల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, డైరెక్టరు కాట్రోతు దేవీలాల్, కాసుల బద్రయ్య. మస్కు బాబు, శ్రీనివాస్గౌడ్, పల్స మల్లయ్య, భీంమ్లానాయక్, రాజునాయక్, గణేశ్, నాగేశ్, రాజు. గోట్య, బీక్య, గోపాల్, శ్రీను ఈశ్వర్, గిరిజన మహిళలు పాల్గొన్నారు.