హయత్నగర్, సెప్టెంబర్ 27: పాడి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు సంస్థ కృషిచేస్తున్నదని, రైతులు ప్రైవేట్ డెయిరీలను నమ్మి మోసపోవద్దని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం హయత్నగర్ డివిజన్ కేంద్రంలోని ఎస్వీఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో నార్ముల్ మదర్ డెయిరీ 22వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో పాల విక్రయాలకు సంబంధించి పోటీ నెలకొన్నదని, పాడి రైతులు నాణ్యమైన పాలు సంస్థకు అందించాలని కోరారు.
అనంతరం పలువురు సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ పాలకవర్గం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. ఓవైపు సంస్థ నష్టాల్లో ఉందని చెబుతూ ఆడిట్లో రూ.1.20 కోట్లు లాభంలో ఉందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏండ్లకు నిర్ణయిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు.
టీఆర్ఎస్ మద్దతుదారుల ఘనవిజయం
నార్ముల్ మదర్ డెయిరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. మదర్ డెయిరీ సంస్థ 3 పాలకవర్గ స్థానాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. 282 మంది సొసైటీ చైర్మన్లకు ఓటు హక్కు కలిగి ఉండగా వారిలో 275 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. మూడు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా టీఆర్ఎస్ మద్దతుదారులు గొల్లెపల్లి రాంరెడ్డికి 239, కస్తూరి పాండుకు 241, మందాడి ప్రభాకర్రెడ్డికి 204 ఓట్లు సాధించి విజయం సాధించారు. మిగతా వారిలో బత్తుల నరేందర్రెడ్డికి 68, ఎస్.వెంకటనర్సింహారెడ్డికి 63 ఓట్లు సాధించారు. విజయం సాధించిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి హనుమంతరావు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. చైర్మన్ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించాల్సి ఉండగా సరైన కోరం లేనందున బుధవారం ఉదయం 11 గంటలకు మదర్ డెయిరీ సంస్థ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారి వెల్లడించారు.