సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర ఘరానా దొంగలను పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు దొంగలను విచారించగా.. కరీంనగర్లో ఓ స్వామీజీని హత్య చేసింది కూడా వీరేనని తేలింది. వివరాలను అదనపు సీపీ (క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు మంగళవారం నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వరంగల్ జిల్లా కోనేటి జ్ఞానేశ్వర్ పీజీ వరకు చదివాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో బాలికను అపహరించడంతో పోక్సో కేసు నమోదయ్యింది. ఆ తర్వాత 2021లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఖమ్మం జిల్లా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. వరంగల్, ములుగుకు చెందిన నీలం శ్రీనివాస్ హత్య కేసులో ఖమ్మం జైలులో ఉన్నాడు. వీరిద్దరికి జైల్లో దోస్తి కుదిరింది.
ఇద్దరు జైలు నుంచి విడుదలైన తర్వాత మే, 2022లో కలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే దొంగతనాలు చేయాలని.. దొంగతనాలు చేయగా వచ్చిన డబ్బును షేర్లలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు కరీంనగర్లోని హనుమాన్ ఆలయంలో ఆశ్రమం నిర్వహిస్తున్న జ్యోతిష్యుడు, స్వామీజీ చెలపూరి పెద్దస్వామిని లక్ష్యంగా ఎంచుకున్నారు. స్వామీజీ వద్ద నగదు, నగలు భారీగా ఉంటాయని, వాటిని దొంగిలించాలని పథకం వేశారు. మూడు రోజుల పాటు స్వామీజీ ఆశ్రమంలో శిష్యులుగా ఉండి.. సేవలు చేస్తూ రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లి మూడు రోజులకు తిరిగి వచ్చారు. మే, 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామీజీ గదిలోకి వెళ్లారు. మీ వద్ద ఉన్న బంగారం, నగదు ఇవ్వాలంటూ బెదిరించారు.
తన వద్ద ఏవీ లేవని స్వామీజీ చెప్పడంతో.. టవాల్ను మెడకు చుట్టి హత్య చేశారు. ఆయన అల్మారాలో ఉన్న రూ. 32 వేల నగదు, స్వామీజీ చెవులకు ఉన్న బంగారు రింగులు తీసుకొని పరారయ్యారు. అక్కడి నుంచి సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ ఒక గ్లామర్ బైక్ను అపహరించి, అక్కడి నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ నాలుగు స్నాచింగ్లకు పాల్పడ్డారు. దొంగిలించిన బైక్పై హైదరాబాద్కు వచ్చారు. ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెలలో స్నాచింగ్కు పాల్పడ్డారు. స్నాచింగ్ ఘటనపై వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, ఎస్ఆర్నగర్ పోలీసులు కలిసి దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం అమీర్పేటలోని మైత్రీవనం సమీపంలో దొంగిలించిన గ్లామర్ బైక్పై వచ్చి, చోరీ సొత్తును విక్రయించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించడంతో కరీంనగర్ స్వామీజీ హత్య కేసు, విజయవాడ స్నాచింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి 10.4 తులాల బంగారు నగలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన స్వామీజీ హత్య కేసులోని నిందితుల కోసం అక్కడి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, స్వామీజీని హత్య చేసిన నిందితులిద్దరూ హైదరాబాద్లో చిక్కడంతో కరీంనగర్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.