సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించి జనసంద్రం చేసిన దీక్షాపరులు మీరు.., జలసౌధంలో ఉద్భవించిన ఉద్యమంతో ఇంతింతై.. వటుడింతై.. కోట్లాది మంది గొంతుకై.. ఢిల్లీ గద్దెను సైతం గడగడలాడించిన ఉక్కు మనిషి మీరు.., 60ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన దీక్షాదక్షులు మీరు.., స్వరాష్ట్రంలో గోల్కొండ ఖిల్లాపై మువ్వన్నెల జెండాఎగరవేతతో స్వాభిమానాన్ని చాటిన ఘనులు మీరు.., ఉద్యమ ప్రస్థానంలో పది జిల్లాలు కలియదిరిగిన మహాయాత్రికులు మీరు.., తెలంగాణ బిడ్డల ఈతిబాధలు తెలిసిన జననేత మీరు.., ప్రజల కష్టాలను, కన్నీళ్లను కళ్లారాగాంచిన మహామనిషి మీరు. పాలననూ మీ చతురతతో ఉద్యమంలా ఉరకలెత్తిస్తున్నారు.., రాష్ర్టాన్ని ప్రగతి వైపు పరుగులెత్తిస్తున్నారు.., సంక్షేమ ఫలాలు ఒకవైపు.. శాశ్వతంగా నిలిచే ప్రగతి పథకాలు మరోవైపు.., పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు.., ఆసరాగా ఉంటున్నారు.., చల్లని ‘చంద్రుని’ వలె పండు వెన్నెలను పంచుతున్నారు.., ఇంకేం కావాలి మాకు.. మా కోసం పరితపించే మీరుండగా.., మా బాగుకోసం తండ్లాడే మీ ఆలోచనలుండగా.., అందుకే యావత్ దేశం మీ పాలన వైపు చూస్తున్నది. ఇక్కడి పథకాలు దేశమంతా అమలు చేయాలని కోరుతున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ఢిల్లీ గద్దెను ముద్దాడి.. యావత్ దేశాన్ని పాలించాలని నినదిస్తున్నది.
మాలాంటోళ్ళ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ సారు పది కాలాల పాటు సల్లంగ ఉండాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మాలాంటి వృద్ధులకు పింఛన్ డబ్బులు ఎంతో ఆసర అవుతున్నాయి. ఇలాంటి నాయకుడు దేశానికి అవసరం. దేశ దశ, దిశను మారుస్తాడు.
అందరి గురించి ఆలోచించే నాయకుడు..!
దేశంలో సంక్షేమాన్ని అందించడానికి ప్రణాళికబద్ధ పాలన అవసరం. అలాంటి పాలనను అందించే లక్షణాలు సీఎం కేసీఆర్కు ఉన్నాయి. దేశంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే అందరి గురించి ఆలోచించే నాయకుడు కావాలి. ఇలాంటి సమయంలో దేశానికి సీఎం కేసీఆర్ అవసరం ఎంతో ఉంది.
– కరీమాబీ, షేక్పేట్
ఇక్కడి పథకాలు దేశవ్యాప్తం చేయాలి
రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్లపై కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నది. పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలతో పూట గడవడమే కష్టంగా మారింది. ఇక్కడ సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీల పేరుతో దోచుకుంటున్నది. పేదల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి బుద్ది చెప్పాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోశించి ఇక్కడి పథకాలు దేశవ్యాప్తం చేయాలి.
– పందిరి శశికళ, ఎన్ఎఫ్సీనగర్, ఘట్కేసర్
విజన్ ఉన్న నాయకుడు..!
సీఎం కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినట్లు దేశాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తారు. దశాబ్దాలుగా ఉత్తరాది పార్టీలకు చెందిన నాయకులు ఢిల్లీ పీఠంపై కూర్చొని మన రాష్ర్టాన్ని చిన్నచూపు చూస్తున్నారు. రైల్వే బడ్జెట్ విషయంలో తెలంగాణకు ఎప్పడూ మొండిచెయ్యే చూపిస్తున్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారతదేశం అర్థికంగా, సామాజికంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– వి.కేశవరావు, వివేకానందనగర్, కూకట్పల్లి
కేసీఆర్తోనే దేశం బాగుపడుతుంది
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వృద్ధులకు గతంలో రూ.200 ఉన్న పింఛన్ ఇప్పుడు రూ.2వేలు పెంచి ఇవ్వడంతో సంతోషంగా బతుకుతున్నాం. అన్నివర్గాల బాగుకోరే ఏకైక నేత సీఎం కేసీఆర్. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి పోవాలి. దేశం మొత్తం బాగుపడుతుంది.
– బషీర్ అహ్మద్, టోలీచౌకి
కులమతాలతో సంబంధం లేకుండా..!
సీఎం కేసీఆర్ కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇవన్నీ ఎందుకు చేయలేదు. ఇలాంటి నాయకుడు రాష్ట్రంతో పాటు దేశంలో ఉండాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం మాదిరిగా దేశంలో అందరికి సంక్షేమ ఫలాలు అందుతాయి.
– పంట శాంతిలత, భగత్సింగ్నగర్, చింతల్
దేశానికి ఆసరాగా నిలుస్తారు.!
పేదల బాధ తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటూ 57 ఏండ్లు నిండిన వృద్ధులకు పింఛన్ ఇచ్చి ఆప్తుడయ్యాడు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ లేదు. సీఎం కేసీఆర్ను దేశ రాజకీయాల్లోకి పంపిస్తే దేశ ప్రజలందరికి ఆసరాగా నిలుస్తున్నారు.
– కావలి మాసయ్య, భగత్సింగ్నగర్, చింతల్