బేగంపేట్, సెప్టెంబర్ 26: గాంధీ వైద్యశాల ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ఆవిష్కరించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. సోమవారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్తో కలిసి ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు. అలాగే బన్సీలాల్పేట్లోని మెట్లబావి వద్ద చేపట్టిన పనులను సైతం పరిశీలించి.. వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… గాంధీ వైద్యశాల ముందు 16 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నట్టు తెలిపారు. ఇందుకోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సైతం అక్టోబర్ 2న ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలతా,మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.