సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ)/చార్మినార్ : నదులు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉన్నదని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రతినిధులు సంయుక్తంగా సాలార్ జంగ్ మ్యూజియం వద్ద మూసీ రివర్ ఫ్రంట్ వాక్ నిర్వహించారు. అనంతరం చారిత్రక మూసీ నది ప్రాముఖ్యతను తెలిపేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వేదకుమార్ మాట్లాడుతూ దేశంలో అనేక నదుల పరిస్థితి దయనీయంగా మారిందని, గతంలోకంటే ఎక్కువ నదులు కలుషితమైనట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ పూర్వపు ప్రధాన నీటి వనరైన మూసీ నది చారిత్రక ప్రాముఖ్యతను భావితరాలకు తెలిపేందుకే ఈ వాక్ నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ప్రయోజనకరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం చేశారని తెలిపారు.
నదులను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నదని చెప్పారు. వచ్చే ప్రపంచ నదుల దినోత్సవం నాటికి డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ఆధ్వర్యంలో నిపుణులు, పౌర సమాజం కలిసి రాష్ట్రంలోని అన్ని నదులను సందర్శించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు వేణుగోపాల్ రావు, పి.నరహరి, ఎండీ ఆప్జల్, సుదర్శన్ రెడ్డి, ఆదర్శ్, పర్యావరణ వేత్తలు, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.