సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా హైదరాబాద్ మారింది. ఒకవైపు కొత్త కంపెనీలు ఏర్పాటవుతుండగా, ఇప్పటికే కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలు సైతం మరింతగా విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. దీంతో నగరంలోని ఐటీ కారిడార్లో ఎక్కడో ఒక చోట కొత్త కంపెనీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు వరుసగా జరుగుతున్నాయి. అందుకు నిదర్శనం వారం రోజుల వ్యవధిలోనే 5 కంపెనీలు తమ కార్యాలయాలను ప్రారంభించడమే.
అనువైన ప్రాంతం హైదరాబాద్
దేశంలోనే ఐటీ పరిశ్రమలకు అత్యంత అనువైన కేంద్రంగా హైదరాబాద్ మారడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశీయ కంపెనీ అయిన టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్తో పాటు వయాసాట్ ఇంక్, లోకజ్ ఇంక్ వంటి విదేశీ కంపెనీలు ఇటీవల నగరంలో తమ కార్యాలయాలను ప్రారంభించాయి. వీటి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూనే ఉంది. ఐటీ ఆథారిత కంపెనీలైన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తుండటంతో కంపెనీలు నగరంపై ఆసక్తి చూపుతున్నాయి.
మెరుగైన మౌలిక వసతులకు తోడు నైపుణ్యం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. గత 7-8 ఏండ్లలో కొత్తగా ఫ్లై ఓవర్లు, లింకు రోడ్లు, అండర్పాస్లను నిర్మించి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు. అంతేకాకుండా విద్యుత్, మంచినీరు తదితర వసతులు కల్పించారు. ఇటీవల ఓ కంపెనీ వెల్లడించిన నివేదికలోనూ ఇదే విషయాన్ని పేర్కొంది.
హైదరాబాద్ ఐటీలో 7.50 లక్షల ఉద్యోగులు
వాస్తవానికి గతంలో ఐటీ రంగం అంటే బెంగళూరు, ఇతర నగరాలు గుర్తొచ్చేవి. తెలుగు రాష్ర్టాల నుంచి కూడా చాలా మంది నైపుణ్యం ఉన్న వారు పొరుగు మెట్రో నగరాల వైపు చూసేవారు. కానీ గత ఆరేండ్లుగా హైదరాబాద్ ఐటీ రంగంలో విప్లవాత్మక పురోగతి కనిపిస్తున్నది. అనేక విభాగాల్లో హైదరాబాద్ నగరం బెంగళూరును వెనక్కి నెట్టినట్లుగా అనేక నివేదికల్లో వెల్లడైంది. దీంతో మంచి నైపుణ్యం ఉన్న కోర్సులు చేసిన వారికి హైదరాబాద్ ఐటీలోనే పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే విషయం మాన్స్టర్ డాట్కామ్ నివేదికలో వెల్లడించింది.
2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి హైదరాబాద్ ఐటీ రంగంలో ఆరు లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, 2021-22 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి 7.50 లక్షల మంది పనిచేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక ఐటీ రంగ నివేదికలో వెల్లడించింది. కేవలం ఏడాది వ్యవధిలో లక్షకు పైగా ఉద్యోగాలు ఐటీ రంగంలోనే హైదరాబాద్ కేంద్రంగా రావడం విశేషం. డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాలకు ఇప్పుడు ఐటీ రంగంలో భారీ డిమాండ్ ఉన్నట్లు ఐటీ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ నైపుణ్యాలు ఉన్న వారికి ఉద్యోగావకాశాలు గతంలో 8శాతం ఉండగా ఈ సంవత్సరం 25 శాతానికి పెరిగినట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు.
ఇటీవల కొత్తగా ప్రారంభమై ఐటీ కంపెనీలు
వయాసాట్ ఇంక్
ఫాక్టేరా ఎడ్జ్
లోకజ్ ఇంక్
టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్
టైగర్ ఎనలిటిక్స్