సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు నలువైపులా అత్యాధునిక వసతులతో కూడిన నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగిన క్యాబినెట్ బేటీలో మరో రెండు ఆరోగ్య టవర్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకొని గురువారం ఆమోదం తెలిపింది. ఇందుకు కోఠిలోని ఈఎన్టీ, మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి దవాఖానను ఎంపిక చేసింది. దీంతో 18 ప్రొఫెసర్ల పోస్టులు సైతం మంజూరు కానున్నాయి. ప్రజలకు సకల సవతులతో కూడిన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
రూ.35 కోట్లతో ఈఎన్టీ టవర్..
చెవి, ముక్కు, గొంతు సమస్యల చికిత్స కోసం కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో ప్రతి నిత్యం 800 నుంచి 1000 మంది వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం 450 పడకల సామర్థ్యం గల ఈ దవాఖానలో 15 మంది స్పెషాలిటీ ప్రొఫెసర్లు ఉన్నారు. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యతో పాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వైద్యసేవలను మరింత విస్తరించేందుకు దవాఖాన ప్రాంగణంలో నూతన టవర్ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రూ.35 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించబోయే ఈఎన్టీ టవర్ను జీ ప్లస్ 5 అంతస్తుల భవనంగా నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.
10 స్పెషలిస్టు పోస్టులు..
దవాఖానలో ప్రస్తుతం 15 మంది ఈఎన్టీ స్పెషాలిటీ వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా అదనంగా కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్కు సంబంధించి 7 పోస్టులు, ఆడియాలజి యూనిట్కు సంబంధించి 3 పోస్టులను మంజూరు చేసినట్లు కోఠి ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. కొత్త టవర్ అందుబాటులోకి వస్తే రోజుకు 1500 నుంచి 2000వరకు ఓపీ కేసులు ఉంటాయని, సర్జరీల సంఖ్య పెరగుతుందని తెలిపారు.
10 మాడరన్ థియేటర్లతో సరోజినీ దేవి కంటి దవాఖాన..
మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి దవాఖానలో ప్రతిరోజు వెయ్యి నుంచి 1200 మంది వరకు రోగులు ఓపీ సేవలు పొందుతారు. రోజుకు సుమారు 100 నుంచి 120 వరకు కంటి శస్త్ర చికిత్సలు జరుగుతాయి.సేవలను విస్తృత పరిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి దవాఖాన ప్రాంగణంలో కొత్త టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 10 మాడరన్ ఆపరేషన్ థియేటర్లు, విశాలమైన ఓపీ విభాగం.. తదితర వాటితో పాటు అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు. కొత్త టవర్ అందుబాటులోకి వస్తే ప్రతి రోజు సులువుగా 200 శస్త్ర చికిత్సలు జరుగుతాయని డా.రాజలింగం వివరించారు. అంతే కాకుండా కొత్తగా 5 అసోసియేట్ ప్రొఫెసర్, 3 ప్రొఫెసర్ పోస్టులు సైతం మంజూరు అవుతాయని, దీని వల్ల యూనిట్ల సంఖ్య పెరిగి రోగులకు వైద్యసేవలు మరింత విస్తరిస్తాయన్నారు.