మేడ్చల్, జూలై16 (నమస్తే తెలంగాణ);‘కులాలు, మతాల ఆధారంగా మేం చిల్లర రాజకీయాలు చేయం. మాది లౌకిక ప్రభుత్వం. అన్ని భాషలు, యాసలకు ప్రాధాన్యమిస్తున్నాం. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ భాషలపై వ్యత్యాసాలు లేవు. అన్ని భాషల విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తాం. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరించేందుకు కొందరు సన్నాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వం ఉచిత విద్యనందిస్తుండడంతో చక్కటి ఫలితాలు వస్తున్నాయి. గురుకులాల ఏర్పాటుతో విద్యావ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి. ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా విద్యార్థులకు ఐఐటీ సీట్లు లభించాయి. 1052 గురుకులాలను అప్గ్రేడ్ చేశాం. 68 ఏండ్లు పాలించిన వారు.. ఏమి చేయకుండా ఇయ్యాల ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వారి గురించి పట్టించుకోవద్దు’ అని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. రూ.2.5 కోట్లతో మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రు లు సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
మతాలు, కులాల ఆధారంగా చిలర్ల రాజకీయాలు చేసే ప్రభుత్వం మాది కాదు..తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ భాషలపై ఎలాంటి వ్యత్యాసాలు లేవు. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని భాషల విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తాం. కొందరు అవివేకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉర్దూను ముస్లింల భాషగా చిత్రీకరించేందుకు కొందరు మూర్ఖులు, సన్నాసులు ప్రయత్నిస్తున్నారు. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచస్థాయిలో విద్యార్థులు పోటీపడేలా రాష్ట్రంలో విద్యావిధానాన్ని అమలు చేస్తున్నాం’ అని ఐటీ,పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలో రూ.2.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని మంత్రులు సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఒకేషనల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రం ఆవిర్భవించిన 8 ఏండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చారని, ప్రాథమిక నుంచి ఉన్నతవిద్య వరకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1052 గురుకులాల్లో ఐదు లక్షల మంది విద్యార్థులున్నారని..ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఇప్పటివరకు 1000 మందికంటే ఎక్కువ విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించారని ప్రకటించారు. 1052 గురుకులాలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం ఎంతో గర్వకారణమన్నారు.
68 ఏండ్లు జరగని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే
విద్యావ్యవస్థలో 68 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి, మార్పులు, అవకాశాలు 8 ఏండ్లలో జరిగాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశామని, వీటితోపాటు అగ్రికల్చర్, లా, డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని, విద్యార్థులు అందుకనుగుణంగా కష్టపడాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధించామని..ఇది ప్రభుత్వ చదువుకు నిదర్శమని గుర్తుచేశారు. రాష్ట్రంలో 68 సంవత్సరాల్లో అభివృద్ధి చేయగలిగే అవకాశం ఉండి కూడా చేయలేని వారి గురించి పట్టించుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలు, అభివృద్ధిని ఢంకా బజాయించి చెబుతున్నామని వివరించారు.
విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులు : సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నారని, విద్యావ్యవస్థలో అనూహ్య మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం 60శాతం ఆడపిల్లలు ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారని, వీరి ఉత్సాహాన్ని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా యూనివర్సిటీని మంజూరు చేశారని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, విద్యాశాఖ మౌలిక వసతుల సంస్థ చైర్మన్ శ్రీధర్రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, నిజాంపేట మున్సిపల్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, దుండిగల్, కొంపల్లి మున్సిపల్ చైర్మన్లు సుంకరి కృష్ణవేణి, సన్న శ్రీశైలంయాదవ్, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ నాగరాజుయాదవ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, విజయశేఖర్గౌడ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మావి స్కీమ్లు..వారివి స్కామ్లు : మల్లారెడ్డి, కార్మిక మంత్రి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చదువుల ఖిల్లాగా మారిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అమెరికాకు, హైదరాబాద్కు తేడా లేదని, అమెరికాలోని తెలంగాణ ప్రాంతవాసులు హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నరాన్నారు. కాంగ్రెస్ హయాంలో కాని అభివృద్ధి పనులు 8 ఏండ్లల్లో తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పగటి కలలు కంటున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎప్పటికీ జరగని పని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని, రేవంత్రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా ఫలితం లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్న రేవంత్రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో స్కీమ్లు ఉంటే..కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో స్కామ్లు ఉంటాయని ఎద్దేవా చేశారు.
దివ్యాంగులకు వాహనాల పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో క్షత్రియాస్ దాతల సహకారంతో ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా 150 త్రిచక్ర వాహనాలను మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు పంపిణీ చేశారు. సిరిసిల్ల, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులకు వీటిని అందజేశారు.
ఒకేషనల్ కళాశాల నిర్మాణానికి రూ.కోటి విరాళం
ఒకేషనల్ కళాశాల భవన నిర్మాణానికి తన తండ్రి కేఎం పాండు ఫౌండేషన్ తరపున రూ.కోటి చెక్కును మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే కేపీ వివేకాంద విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి అందజేశారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వివేకానందను మంత్రులు అభినందించారు.
నోట్పుస్తకాలు,దుస్తులు అందజేస్తా..
కొంతకాలంగా దుండిగల్ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నోట్పుస్తకాలు, రెండు జతల దుస్తులు, ఇతర వస్తువులను అందజేస్తుండడంపై మంత్రులు ఆయన్ను అభినందించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తానని ఎమ్మెల్సీ ముందుకురావడంపై ప్రశంసించారు.
మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఐటీ,పురపాలక శాఖమంత్రి కేటీఆర్కు టీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ దవాఖాన నిర్మాణం, డిగ్రీ, ఉర్దూ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
వాళ్లవి పొంతన లేని మాటలు
‘మనఊరు-మనబడి’పై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదంటడు. పక్కనే ఉన్న మరో నాయకుడు మధుయాస్కీ పథకంలో పెద్ద కుంభకోణం జరిగిందంటారు. ప్రెస్మీట్లో మాట్లాడే వారిద్దరికే సఖ్యత లేదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుల విమర్శలను మంత్రులు తిప్పికొట్టాలి.