సిటీబ్యూరో, జూలై11(నమస్తే తెలంగాణ): డేటింగ్ యాప్ మోజులో పడిన ఓ వైద్యుడు రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. రెండు దఫాలుగా రూ.71.5 లక్షలు పోగొట్టుకోగా, తాజాగా రూ.80 లక్షలు నేరగాళ్లకు సమర్పించుకున్నాడు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన ఆ వైద్యుడు ఆర్థికంగా చితికిపోయాడు. భవిష్యత్తును తలచుకుంటూ ఆ వైద్యుడి కుటుంబ సభ్యులు సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అలా మొదలయ్యింది…
సికింద్రాబాద్కు చెందిన ఓ వైద్యుడు(57) కేంద్ర ప్రభుత్వ సర్వీస్లకు ఎంపికై, గుజరాత్లో విధులు నిర్వహిస్తున్నాడు. లోకంటో వెబ్సైట్ గురించి తెలుసుకొని, 2020 జూన్లో ఆ వెబ్సైట్లోకి వెళ్లి డేటింగ్కు సంబంధించిన ప్రకటనలో ఉన్న నంబర్కు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే అవతలి నుంచి మంచి ఇంగ్లిష్, హిందీ భాషలో అమ్మాయిలు మాట్లాడారు.
మాటల్లో అతడిని ఉచ్చులోకి దింపారు. డేటింగ్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉంటే మా వద్ద ఉన్న ఫొటోలు పంపిస్తామంటూ అతడికి వ్యక్తిగత ఫొటోలు పంపించారు. ఆ ఫొటోలలో ఉన్న వాళ్లతో మీరు డేటింగ్ చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ మొదలు పెట్టారు. ఇలా ఆ యువతులతో వీడియో, టెక్ట్స్ చాటింగ్లు చేయిస్తూ నాలుగు నెలలు వైద్యుడి నుంచి రూ. 41.5 లక్షలు లాగేశారు. 2020 అక్టోబర్లో కుటుంబ సభ్యులతో కలిసి సీసీఎస్ సైబర్క్రైమ్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండోసారి..
కేసు నమోదైన తర్వాత రెండు నెలల పాటు విరామమిచ్చిన వైద్యుడు.. మళ్లి డేటింగ్ యాప్ మోజులో పడ్డాడు. అతడి వ్యవహారాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు ప్రాథమిక స్థాయిలోనే బ్యాంకు ఖాతాను కూడా ఫ్రీజ్ చేయించారు. మరో బ్యాంకు ఖాతాను ఉపయోగిస్తూ డేటింగ్ యాప్లో చాటింగ్, వీడియో చాటింగ్లు చేస్తూ దాదాపు రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. 2021 మార్చిలో పోలీసులను ఆశ్రయించారు.
అయినా మారలేదు..
రెండో ఘటన జరిగిన తర్వాత కూడా బాధితుడు మారలేదు. తిరిగి డేటింగ్ యాప్లో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. సంవత్సర కాలంగా రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కొంత కాలంగా డేటింగ్ యాప్లో చాటింగ్ చేస్తున్న ఈ వైద్యుడు రూ.1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎలాగైనా అతడిలో మార్పు తేవాలంటూ కుటుంబ సభ్యులు తాజాగా సోమవారం బాధిడిని తీసుకొని, సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ బాధితుడి మైండ్ సెట్ ఇలా ఎందుకుందని ఆరా తీస్తున్నారు.
రాజీ కుదుర్చుకొని.. మళ్లీ వలలో చిక్కుకొని..
మొదటి ఫిర్యాదు.. రెండో ఫిర్యాదును జత చేసి దర్యాప్తు చేసిన సైబర్క్రైమ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడి ఖాతాలో రూ. 17 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అయితే, నిందితుడిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను సంప్రదించాడు. మీరు అరెస్ట్ చేసిన వాడికి, నా కేసుకు సంబంధం లేదంటూ పోలీసులకు చెప్పాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నాం.. అతడి ఖాతాలో మీరు డబ్బులు డిపాజిట్ చేశారు.. అంటూ పోలీసులు చెప్పారు. అయినా.. అసలు నిందితుడు వీడు కాదు.. వాళ్లు వేరే ఉన్నారు.. అతడిని వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. మా చేతిలో ఏమీ లేదు.. అరెస్ట్ చేసి జైలుకు పంపించాం.. కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించినా వినలేదు. చివరకు పోలీసులపై ఒత్తిడి తెచ్చి లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకున్నాడు. నిందితుడు డబ్బులు ఇస్తానని చెప్పినా బాధితుడు తీసుకోలేదు.. సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడటంతోనే బాధితుడు ఇలా రాజీ కుదుర్చుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.