వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 29: ఔషధ మొక్కల పెంపకం ఎంతో లాభదాయకమని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఔషధ,సుగంధ మొక్కల విభాగం హెడ్, సీనియర్ సైంటిస్ట్ జె. చినానాయక్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్లోని తమ కార్యాలయం ఆవరణలో జరిగిన ఉచిత శిక్షణకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితులలో ఔషధ, సుగంధ పంటల కొనుగోలు, వాడకం అధికమైందన్నారు. ప్రధానంగా అశ్వగంధ, అలోవేర, సుగంధ, నిమ్మగడ్డి, రూషాగడ్డి, సిట్రోనెల్ల, నన్నారీ తదితర ఔషధ మొక్కల వేర్లు, ఆకులు, కాండం, ఆయుర్వేద, యునానీ ఔషధాల తయారీలో వాడడం వల్ల అధిక డిమాండ్ ఉంటుందన్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం సంచాలకులు డా. కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. పట్టణాలలో మిద్దెపై ఔషధ మొక్కలు పెంచడం ఎంతో లాభదాయకమన్నారు. సీఐఎంఏపీ డా. జ్ఞానేశ్వర్, క్షేత్ర పరిశోధనలో భాగంగా సుగంధ తైలాలు, అలోవేరా జ్యూస్ తయారీ విధానాన్ని చూపించారు. సీనియర్ శాస్త్రవేత్తలు డీపీ ప్రశాంత్, అనిత కుమారి, లావణ్య, కృష్ణవేణి, టి. కుమార్ , స్వర్ణలత తదితరులు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.