బంజారాహిల్స్, జూన్ 29: దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవ పరికరాలను అందిస్తున్నామని, అవసరమైన వారందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. దివ్యాంగులకు, వయో వృద్ధులకు అవసరమయ్యే కృత్రిమ అవయవ పరికరాలను అందించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా బుధవారం బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని జీహెచ్ఎంసీ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. అంగవైకల్యంతో బాధపడుతూ కృత్రిమ పరికరాలు అవసరమైన వారికి అలిమ్కో స్వచ్ఛంద సంస్థ సహకారంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పరికరాలు అందజేస్తామని తెలిపారు.
వాకింగ్ స్టిక్స్, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్, ఎంఎస్ఐఐడీ కిట్, రోళ్లటర్స్, వీల్చైర్, స్మార్ట్ క్యాన్, ఆర్టిఫిషియల్ లింబ్స్ తదితర పరికరాలను సిద్ధం చేశామని, అర్హులైనవారికి కొలతలు తీసుకుని త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సర్కిల్ 18 పరిధిలో బుధవారం నిర్వహించిన శిబిరంలో 154 మంది వివిధ రకాల కృత్రిమ అవయవ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు కొలతలు కూడా ఇచ్చారని డీఎంసీ రజినీకాంత్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, యూసీడీ విభాగం అధికారి హిమబింధు తదితరులు పాల్గొన్నారు.