ఖైరతాబాద్, జూన్ 28 : రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. ఇంటి యజమాని సంపాదించి తెస్తేనే ఆ ఇంట్లో నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. గత మూడేండ్లుగా అనారోగ్యం కారణంగా ఆ కుటుంబం వీధిన పడింది. గుండె, మూత్రపిండాలు రెండు చెడిపోయాయి. వెంటనే మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో చికిత్స తీసుకుంటున్న బాధితుడు.. తన చికిత్స ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. చౌటుప్పల్ మండలంలోని తంగడిపల్లికి చెందిన బొడ్డు మహేశ్ (36), ఉమా దంపతులు. రెండున్నర సంవత్సరాల పాప నివేదితతో కలిసి జీవిస్తున్నారు. మహేశ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల కిందట మూత్రపిండాల సమస్య రావడంతో నిమ్స్కు వచ్చాడు. చికిత్స తీసుకుంటుండగానే రెండు కిడ్నీలు చెడిపోయాయి. ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో ఆ ప్రయత్నంలో ఉండగా, గుండె సమస్య కూడా వచ్చింది. దీంతో కిడ్నీ, గుండె రెండు ఒకేసారి మార్చాలని వైద్యులు సూచించడంతో దిక్కుతోచని స్థితిలో వారి పడిపోయారు.
ఒకే డోనర్ నుంచి….
ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న బొడ్డు మహేశ్కు మూత్రపిండం ఇవ్వడానికి తండ్రి సిద్ధంగా ఉన్నా.. గుండె కూడా మార్చాల్సి ఉండగా, ఒకే వ్యక్తి నుంచి సేకరించిన వాటిని అతడికి అమర్చాలని వైద్యులు సూచించడంతో సమస్య మొదటికొచ్చింది. జీవన్దాన్లో నమోదు చేసుకున్న మహేశ్ ప్రస్తుతం దినం తప్పి దినం నిమ్స్లో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్సలు చేసినా.. మరోసారి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే లక్షలాది రూపాయల విలువైన ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. దీంతో ఉద్యోగం లేక, కుటుంబాన్ని పోషించే వారు కరువై దిక్కుతోచని స్థితిలో భార్య ఆపన్నుల సాయం కోసం ఎదురుస్తున్నది. మూత్రపిండాలు, గుండె మార్పిడి, మందుల కోసం కనీసం రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించినట్లు భార్య ఉమా తెలిపారు. దాతలు 9542301531, 9676109460 నంబర్లకు గూగుల్, ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని ఆమె వేడుకుంటున్నారు.