జీడిమెట్ల, జూన్ 27: రాష్ట్రంలో చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. సోమవారం గాంధీనగర్ పారిశ్రామికవాడలో అంతర్జాతీయ పరిశ్రమల దినోత్సవ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆరు నెలల లోపే కరెంటు కోతలు లేకుండా.. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, స్థలాల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఐటీ, పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మాట్లాడుతూ.. 2014 తర్వాత పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నారని తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.సుధీర్రెడ్డి, కార్పొరేటర్ బి.విజయ్శేఖర్గౌడ్, పారిశ్రామిక వేత్తలు శ్రీనివాస్గౌడ్, స్వామి గౌడ్, హరినాథ్ గౌడ్, వాకిటి రాంరెడ్డి, కరుణాకర్రెడ్డి, గంధం రాములు, రవీందర్రావుతో పాటు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.