గోల్కొండ కోట వద్ద ప్రపంచ డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా హైద్రాబాద్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి ఆధ్వర్యంలో పీహెచ్సీల సిబ్బంది, ఏఎన్ఎంలు, డాక్టర్లు, సిబ్బంది సోమవారం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఓపీ డాక్టర్ అనూరాధ, డాక్టర్లు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ): దోమ కాటు వల్ల విజృంభించే డెంగీ, చికున్ గున్యా, మలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా మరణాలకు సైతం దారి తీస్తాయని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి అన్నారు. డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుంచి నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటి మాట్లాడుతూ డెంగీని అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, అందుకు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని సూచించారు.
దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి యూపీహెచ్సీ పరిధిలో ర్యాలీలు నిర్వహించినట్టు తెలిపారు. ఇంట్లో కాని, పరిసరాల్లోగాని నీరు నిలువ ఉండకుండా చేయడం వల్ల దోమల వృద్ధి, వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. డెంగీకి కారణమయ్యే ‘టైగర్’ దోమ కూలర్లలో, వాడి పడేసిన కొబ్బరి బొండాలు, కుండలు, పూల కుండీలలో వృద్ధి చెందుతాయని వివరించారు. దోమలను నివారించగలిగితే డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు రాకుండా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.