ఎల్బీనగర్, మే 7: సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది. పోలీసుల కథనం ప్రకారం.. దిల్సుఖ్నగర్ న్యూ గడ్డిఅన్నారం కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి జంగయ్య యాదవ్, భూదేవి ( 58) దంపతులు నివాసముంటున్నారు. శుక్రవారం రాత్రి జంగయ్య గ్రౌండ్ ఫ్లోర్లో, మొదటి అంతస్తులో అతడి భార్య భూదేవి, కుమారుడు సాయితేజ నిద్రించారు. ఉదయం భూదేవి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన జంగయ్య ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇంట్లోని అల్మారలో ఉన్న 30 తులాల ఆభరణాలు, రూ. 10 లక్షల నగదు కూడా కనిపించకుండాపోవడం, సీసీ కెమెరాల తీగలు కట్ చేసి ఉండటంతో భూదేవి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.