హైదరాబాద్ ఖ్యాతి ఎల్లలు దాటుతోంది..విశ్వనగరంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ పెట్టుబడుల స్థావరంగా విరాజిల్లుతోంది. అనుకూల వాతావరణం, చక్కటి శాంతిభద్రతలు, రవాణా సౌకర్యం, నిరంతర విద్యుత్, మెరుగైన వసతులతో దేశ, విదేశీ కంపెనీలు నగరబాట పడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ డేటా సెంటర్లను నగరంలో నెలకొల్పుతున్నాయి. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో బెంగళూరుతో హైదరాబాద్కు పోటీ ఉన్నా, ఇక్కడున్న మౌలిక వసతులు కంపెనీలు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి.
ఆఫీస్ స్పేస్లో ఇతర మెట్రో నగరాల కంటే నగరం మంచి మెరుగుదలను కనబరిచింది. ఇప్పటివరకు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉండే బెంగళూరును మించి వృద్ధి రేటు కనబరిచింది. ఐటీ కార్యాలయాల కోసం నిర్మిస్తున్న స్థలం, మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఉండడంతో కంపెనీలు ఆఫీస్ స్పేస్ను లీజు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని వెస్టియన్ తన నివేదికలో వెల్లడించింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దక్కన్ పీఠభూమిగా పేరొందిన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్నది. చక్కని వాతావరణం, మెట్రో, ఎస్ఆర్డీపీ, ఔటర్ రింగు రోడ్డు, నిరంతర విద్యుత్, సమృద్ధిగా తాగునీరు ఇతర మెరుగైన మౌలిక వసతులు వెరసి.. పెట్టుబడులకు అనుకూలమని భావిస్తూ.. టీఎస్ ఐపాస్ లాంటి విధానాలకు ఆకర్శితులై జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
ఆయా కంపెనీలు తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకుంటుకున్నాయి.కరోనా సంక్షోభంలోనూ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే రియల్ రంగం గణనీయమైన వృద్ధి సాధించింది. రియల్ ఎస్టేట్ సంస్థలు 30 మిలియన్ స్కేర్ఫీట్ల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్పేస్లను నిర్మించి డెలివరీకి సిద్ధం చేశాయి. ఈ రంగంలో 40వేల కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం లభించింది. ముఖ్యంగా హైటెక్సిటీ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, కోకాపేట లాంటి ప్రాంతాల్లో ఊహించని విధంగా డిమాండ్ నెలకొంది.
హైదరాబాద్ ఆసియాలోని లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా, గ్లోబల్ కంపెనీలకు గమ్యస్థానంగా మారిందని వెస్టియన్ సమగ్ర నివేదికలో పేర్కొన్నది. మొత్తం 800లకు పైగా ఫార్మా, బయో, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు నగరం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ నుంచే ఈ కంపెనీలు 50 మిలియన్ల యూఎస్ డాలర్ల వ్యాపార లావాదేవీలు జరుపుతున్నాయని, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలతో దశబ్ద కాలంలో వ్యాపార లావాదేవీలు వంద బిలియన్లకు చేరుకునే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్లో కార్యాలయాల స్థలాల మార్కెట్ ఇతర మెట్రో నగరాల కంటే మంచి మెరుగుదలను కనబర్చింది. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు కోరుకునే నగరాల్లో హైదరాబాద్కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అగ్ర స్థానంలో ఉండే బెంగళూరును మించి వృద్ధి రేటును కనబరుస్తున్నది. ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు చెందిన వేలాది కంపెనీలు నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే అతి పెద్ద కంపెనీలైన ఐబీఎం, అసెంచర్, హెచ్పీ, జీఈ వంటి కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఐటీ సంస్థల కార్యాలయాల కోసం నిర్మిస్తున్న స్థలం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటంతో దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు నగరంలోనే ఆఫీస్ స్పేస్ను లీజుకు తీకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి.
నగరం 2-3 సెస్మిక్ జోన్లో ఉన్నందున భూకంపాలు, వరదలు అనేవి అత్యంత స్వల్పం. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం విపరీతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల అతి పెద్ద పెట్టుబడిగా రెండు బిలియన్ల పెట్టుబడిని పెట్టేందుకు హైదరాబాద్ను ఎంచుకుంది. అంతకుముందే అమెజాన్, ఇతరత్రా అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపాయి.
హైదరాబాద్ చుట్టూ గిడ్డంగుల స్పేస్లో అనూహ్య వృద్ధి నమోదయ్యేందుకు ప్రధాన కారణం పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి. జీడిమెట్ల, కొంపల్లి క్లస్టర్లలో గిడ్డంగుల ఏర్పాటు గణనీయంగా జరిగింది. ఈ-కామర్స్ కంపెనీలు, 2021లో 3.1 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగుల స్పేస్ లీజుకు అందుబాటులో ఉంది.
దేశంలోనే హైదరాబాద్లో ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. సుమారు 90 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. 1998 నుంచి మొదలై ఐటీ కంపెనీల కార్యకలాపాలు కాలక్రమేణా పెరుగుతుండగా, తెలంగాణ వచ్చిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. ఓఆర్ఆర్, మెట్రో రైలు, ఎస్ఆర్డీపీ వంటి ప్రాజెక్టులతో పాటు ఐసీటీ పాలసీ-2016తో ఒక్కసారిగా ఐటీ కంపెనీల కార్యకలాపాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరుగుతూ వస్తున్నాయి.
ఉత్తమ కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్. మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో వరుసగా ఐదుసార్లు ఉత్తమ నగరంగా గుర్తింపును పొందడం.
జాతీయ ఫార్మా రంగంలో హైదరాబాద్లోనే 35 శాతం ఉత్పత్తి. విదేశీ ఎగుమతుల్లో 20 శాతం వాటా.
కేంద్రం, ప్రపంచ బ్యాంకు చేపట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం ప్రతిసారీ దేశంలో ముందు
వరుసలో నిలవడం.