హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగర ప్రజల అవగాహన నిమిత్తం మంగళవారం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. పౌరులు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి అన్ని జాత్రత్త చర్యలను పాటించాల్సిందిగా సూచించారు. ఇతర రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫేస్ మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు.
నగరంలోని కోఠి, ఇందర్బాగ్, సుల్తాన్ బజార్, నాంపల్లి, చార్మినార్, అబిడ్ రోడ్, సికింద్రాబాద్, మలక్పేట, మోహదీపట్నం ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నియమాలు ఉల్లంఘించిన పలువురిపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద మిర్చౌక్ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 100 ఫేస్ మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలనే నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది ఫేస్ మాస్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.