వెంగళరావునగర్, జూన్ 9 : రెండేండ్ల క్రితం నిధులు మంజూరు చేశాం. వానకాలం రాబోతుంది..సీవరేజీ పైపులైన్ నిర్మాణ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. ఇంకెప్పుడు చేపడ్తారో.. ఎప్పటికీ పూర్తి చేస్తారో తెలీదు.. విధుల్లో ఇంతటి నిర్లక్ష్యమా అంటూ జలమండలి అధికారులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శ్రీనగర్కాలనీ ఎస్బీహెచ్ కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిగూడ బాటా షోరూం రోడ్డుపై వరదనీటి సమస్య గురించి సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్తో కలిసి స్థానికులు ఎమ్మెల్యే మాగంటికి ఫిర్యాదు చేశారు.
అక్కడే ఉన్న జలమండలి డీజీఎం దిలీప్ను సమస్యపై ఆరా తీశారు. సీఆర్ఎంపీ నుంచి అనుమతులు రాలేదని..అందుకే జాప్యం జరిగిందని డీజీఎం చెప్పుతుండగా ఎమ్మెల్యే మాగంటి వెంటనే సీఆర్ఎంపీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆ పనులకు సంబంధించి తమ నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని..హైవే నుంచి పైపులైన్ వెళ్తుందని జలమండలి అధికారులే చెప్పారని అసలు విషయం చెప్పారు. డీజీఎం దిలీప్పై ఎమ్మెల్యే మాగంటి తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించననని డీజీఎంను ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఎస్బీహెచ్ కాలనీ పార్కులో స్థానికులతో ఎమ్మెల్యే మాగంటి సమావేశమయ్యారు. పార్క్ లోపల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని.. పార్కు ప్రహరీ ఎత్తు పెంచాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. వారం లోపు ట్రాక్ పనులు చేపట్టాలని.. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్యాదవ్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మోహన్రెడ్డి, డీఈ చైతన్య, కిరణ్మయి, ఈఈ వెంకటేశ్వర్లు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సంగీత శ్రీరాంవర్, మధుసూదన్రెడ్డి, డివిజన్ నాయకులు శరత్ గౌడ్, మధుయాదవ్, మారుతి, నాగమణి, అంబిక తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, జూన్ 9: పట్టణ ప్రగతికి ప్రజలు సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్లో గురువారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన జహ్రా గుల్షన్బాగ్, మోడల్ రైతుబజార్ పరిసర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.
జహ్రా గుల్షన్బాగ్ బస్తీవాసుల వినతి మేరకు తాగునీటి పైప్లైన్ను విస్తరించటం, విద్యుత్ తీగల స్థానంలో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు రైతుబజార్ పరిసరాల్లో ఉన్న చెత్తను తరలింపజేసే పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, అధికారులు రాజ్కుమార్, బిందుభార్గవి, రామచంద్రరాజు, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, నేతలు పల్లవియాదవ్, గంట మల్లేశ్, మహ్మద్అహ్మద్, ముస్తాక్, కల్యాణి, సంతోష్గౌడ్, ప్రభాకర్, జులేఖా తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,జూన్9: నేటి నుంచి పాఠశాలల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని యూసుఫ్గూడ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ 19 వ సర్కిల్లోని యూసుఫ్గూడ, రహ్మత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డలోని పాఠశాలల ప్రాంగణాలలో పారిశుధ్య సిబ్బంది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.